అర్థరాత్రి లేడీస్ హాస్టల్లోకి దూరుతాడు.. ఆపై బ్లేడుతో..
హైదరాబాద్ : అర్థరాత్రి లేడీస్ హాస్టల్స్ లోకి దూరడం.. కనిపించిన మొబైల్స్ ను దొంగిలించేయడం.. ఎవరైనా అడ్డు చెబితే.. బ్లేడుతో బెదిరించడం.. ఆపై అందులో ఉన్న నంబర్లకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ ఆనందం పొందడం.. ఇదీ ఓ దొంగ గారి వరుస.
కరీంనగర్ జిల్లా పెద్దంపేటకు చెందిన సిలివేరి సంతోష్ కుమార్ అనే యువకుడు బోరబండలోని పర్వతనగర్ లో ఉంటూ.. లేడీస్ హాస్టల్స్ లో చోరీలకు అలవాటు పడ్డాడు. హాస్టల్స్ ఎక్కువగా ఉండే.. ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి, మాదాపూర్ ప్రాంతాలనే టార్గెట్ గా చేసుకున్నాడు సంతోష్. రాత్రిపూట హాస్టల్స్ లోకి చొరబడి సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నాడు.
ఆ సమయంలో ఎవరైనా అమ్మాయిలు మెలుకవతో ఉంటే.. బ్లేడుతో బెదిరించి పరారవుతున్నాడు. ఇదే తరహాలో ఓ హాస్టల్ లోను చోరి చేసిన సంతోష్ పై ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు సంతోష్ ఆగడాలకు ఫుల్ స్టాప్ పడింది. సంతోష్ పై నిఘా పెట్టి ఓ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించిన పోలీసులు.. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం నిందితుడి వద్ద నుంచి 8 సెల్ఫోన్లు, రెండు మెమరీకార్డులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ లోను మహిళలను వేధించి జైలుకి వెళ్లి వచ్చిన చరిత్ర ఉన్న సంతోష్ పై.. నగరంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ఇప్పటిదాకా 9 కేసులు నమోదయ్యాయి. నిందితుడిని రిమాండ్ కు తరలించిన పోలీసులు.. హాస్టల్ యాజమాన్యాలు అలసత్వంగా ఉంటున్నాయని, ప్రతీ హాస్టల్ లోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.