రేవంత్ రెడ్డికి గట్టి స్పాట్.. ఆ చిట్టాను జగన్కు ఇవ్వనున్న టీఆర్ఎస్..?
మల్యాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కేసుల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ నేతలే రేవంత్పై విమర్శలు గుప్పిస్తున్న వేళ.. నేరుగా కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగడం గమనార్హం. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ను రేవంత్ రెడ్డి డ్రోన్ కేసులో పార్టీ అపాయింట్ చేసింది. ఈ నేపథ్యంలో అటు టీఆర్ఎస్ కూడా దూకుడు పెంచింది. రేవంత్ భూ అక్రమాలే కాదు.. ఏపీలో ఆయన కుమార్తె చేస్తున్న వ్యాపారాలపై అనుమానం వ్యక్తం చేస్తోంది. అవి సక్రమమా.. అక్రమమా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని చెబుతోంది.
క్రిశాంత్ ఏమన్నారు.. ఆ జీవో ఏం చెబుతోంది..
టీఆర్ఎస్ ప్రతినిధి క్రిశాంక్ రేవంత్ రెడ్డి డ్రోన్ కేసు వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గోపన్పల్లిలో దళితుల భూములను కబ్జా చేసిన రేవంత్.. అడ్డంగా దొరికిపోవడంతో కేటీఆర్ ఫాంహౌజ్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పెద్ద నాయకులను టార్గెట్ చేస్తే పెద్దగా నేతగా ఎదగవచ్చనేది రేవంత్ మనస్తత్వం అని.. అందుకే కేటీఆర్ ఫాంహౌజ్పై పడ్డారని అన్నారు. జీవో.111 ప్రకారం కాలుష్యపూరితమైన పరిశ్రమలు,కంపెనీలు జనువాడలో నిర్మించడానికి వీల్లేదని.. ఫాంహౌజ్ నిర్మాణాలకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. అన్ని రకాల అనుమతులతోనే కేటీఆర్ అక్కడ ఫాంహౌజ్ నిర్మించుకున్నట్టు తెలిపారు. తన భూ అక్రమాల కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేటీఆర్ ఫాంహౌజ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు.
కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో నిబంధనలు తుంగలో తొక్కారన్న ఆరోపణలు
2011లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జనువాడలో పలు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారని క్రిశాంక్ తెలిపారు. జీవో.111 ప్రకారం కాలుష్యపూరితమైన పరిశ్రమలకు అనుమతులు ఇవ్వవద్దన్న నిబంధన ఉన్నప్పటికీ.. అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కిరణ్ కుమార్ కేబినెట్లో మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఓవైపు దళితులకు మూడెకరాల భూమి కోసం ప్రభుత్వం.. ఖాళీ స్థలాలను అన్వేషిస్తుంటే.. రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు దళితుల భూమిని కాజేయడం దారుణం అన్నారు. భూఆక్రమణల వ్యవహారాన్ని అధికారులు గుర్తించి నోటీసులు ఇస్తే.. దానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తీహార్ జైలుకు వెళ్లొచ్చిన నేతకు కర్ణాటకలో పీసీసీ పదవి ఇవ్వడంతో.. జైలుకు వెళ్లొచ్చినవాళ్లకు టీపీసీసీ వస్తుందని రేవంత్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఆ వివరాలు జగన్కు ఇస్తామన్న క్రిశాంక్
ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి కుమార్తె నిమిషా రెడ్డి వ్యాపారాలపై క్రిశాంక్ సందేహాలు వ్యక్తం చేశారు. 2018లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోవడానికి కొద్దిరోజుల ముందు భీమవరంలో కామెరూన్ ఫుడ్స్ పేరుతో ఆమె వ్యాపారాలు ప్రారంభించిందన్నారు. కోట్ల రూపాయల వ్యవహారానికి సంబంధించిన ఆ వ్యాపారం అక్రమమా.. సక్రమమా అన్నది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇదొక్కటే కాదు.. రేవంత్ అక్రమాలన్నీ బయటకు తీయాల్సిన అవసరం ఉందన్నారు.అలాగే రేవంత్&మాఫియా కేటీఆర్పై వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేస్తోందని.. వాటిని స్క్రీన్ షాట్స్ తీసి పరువు నష్టం దావా వేస్తామని అన్నారు.
Recommended Video
జగన్ దృష్టికి వెళ్తే..
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం భారీ ఖర్చుతో చేపట్టిన ప్రతీ పనిపై రివ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో పోలవరంకి రీ టెండరింగ్ నిర్వహించారు. అలాగే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన పీపీఏలను రద్దు చేశారు. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీలోని రేవంత్ రెడ్డి కుమార్తె వ్యాపారాలపై అనుమానం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోవడానికి కొద్దిరోజుల ముందు చేసిన ఈ ఒప్పందాల వెనుక ఏమైనా అవకతవకలు ఉన్నాయేమో పరిశీలించాలని జగన్ ప్రభుత్వాన్ని కోరబోతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఏపీ సీఎంకు ఈ విజ్ఞప్తి వెళ్తే.. రేవంత్ కుమార్తె వ్యాపార ఒప్పందాలు,అనుమతులపై సమీక్ష నిర్వహించే అవకాశం లేకపోలేదు.