కృష్ణా జలాల వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల లెక్కలను తేల్చిన కృష్ణా బోర్డ్..!
అమరావతి/హైదరాబాద్ : కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు తమ వాటాను రికార్డు స్థాయిలో వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు కలిపి 920.405 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ 647.559 టీఎంసీల వినియోగించుకోగా, తెలంగాణ 272.846 టీఎంసీల నీటిని ఉపయోగించుకుంది. ఆంధ్రప్రదేశ్ వాటా వినియోగం పూర్తి కాగా, తెలంగాణ వాటాలో ఇంకా 60.605 టీఎంసీల వాటా మిగిలి ఉంది. ఉమ్మడి ప్రాజెక్ట్లు, మధ్యతరహా ప్రాజెక్ట్లలో కనీస నీటి మట్టానికి ఎగువన 60.333 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి.
Recommended Video
వాడుకుంటున్నది చాలు..!మళ్లీ అదనపు వాటా ఎందుకంటూ ఏపీకి కృష్ణా రివర్ బోర్డు లేఖాస్త్రం..!!
కృష్ణా జలాల వినియోగంలో రికార్డు.. వాటా పూర్తి చేసుకున్న ఏపి ప్రభుత్వం..
అంతే కాకుండా కేఆర్ఎంబీ (కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) మంగళవారం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. రాష్ట్ర విభజన తర్వాత గత ఆరేళ్లుగా కృష్ణా నదీ జలాల వినియోగపు లెక్కలను కృష్ణా బోర్డు స్పష్టంగా తేల్చి చెప్పింది. ఉమ్మడి రాష్ట్రంలో నీటి వినియోగం లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉండేది కాదు. కాని రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో అంతర్రాష్ట్రాల నీటి వినియోగం ఒప్పందాల ప్రకారం ఏ రాష్ట్రం ఎంత నీటిని వినియోగించుకుందో స్పష్టం చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దీంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జోక్యం చేసుకుని ఇరు రాష్ట్రాల నీటి వినియోగపు లెక్కలను తేల్చిచెప్పింది.
ఎవరి వాటా ఎంత.. స్పష్టత ఇచ్చిన కేఆర్ఎంబీ..
నీటి వినియోగాల సంవత్సరం జూన్ 1వ తారీఖు నుండి ప్రారంభమై, మే 31న ముగుస్తుంది. ఈ నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి భారీగా 1,782 టీఎంసీల ప్రవాహం వచ్చింది. నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్లు నిండాయి. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తూనే ప్రకాశం బ్యారేజీలో మిగులుగా ఉన్న 801 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 169.668 టీఎంసీలు, హంద్రీ-నీవా ద్వారా 41.918, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 5.410, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 3.333టీఎంసీలు మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ 220.329 టీఎంసీలు వినియోగించుకుందని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది.
8 ప్రాజెక్టుల డీపీఆర్లు తక్షణమే ఇవ్వండి.. టీ సర్కార్కు కృష్ణా బోర్డు ఆదేశం..
ఇదిలా ఉండగా కృష్ణా జలాలను తరలించుకోవడానికి కొత్తగా చేపట్టిన ఐదు ప్రాజెక్టులతోపాటు సామర్థ్యం పెంచిన మూడు ప్రాజెక్టులతో కలిపి మొత్తం 8 ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు తక్షణమే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశించింది. ఇదే అంశంపై అక్టోబర్ 16న రాసిన లేఖకు స్పందించలేదని గుర్తు చేస్తూ ఇప్పటికైనా వాటి డీపీఆర్లు సమర్పించాలని స్పష్టం చేస్తూ బోర్డు సభ్యుడు హెచ్కే మీనా మంగళవారం తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
మా వాటా నీటిని తరలించేందుకే ఎత్తిపోతల.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ..
శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల కంటే దిగువకు నీటిమట్టం చేరినప్పుడు కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేసినా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కరవు పీడిత రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగునీటి అవసరాల మేరకు నీటిని తరలించలేని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలు తీర్చడం కోసం శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు దిగువన ఎస్సార్బీసీలో 4 కిలో మీటర్ల వద్దకు ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలపై కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కృష్ణా బోర్డు చేసిన కేటాయింపుల ప్రకారమే తమ వాటా నీటిని తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.