ఈ గొడవ మీరే తేల్చుకోండి: కృష్ణా నీటిపై ఏపీ-తెలంగాణలకు కేంద్రం
న్యూఢిల్లీ: కృష్ణా నది నీటి సమస్యను తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలే తేల్చుకోవాలని కేంద్ర జలవనరుల శాఖ బుధవారం నాడు తేల్చి చెప్పింది. కృష్ణా నీటి వాటాల పైన కొన్నాళ్ల పాటు యథాస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. కృష్ణా బోర్డు సూచనలు పాటించాలని తెలిపింది.
సమస్య పరిష్కారానికి మార్గం లభించనందున మరో నెల రోజుల పాటు గత సంవత్సరం మాదిరిగానే నీటి నిర్వహణ ఉంటుందని చెప్పింది. ఈ లోగా ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూర్చొని, చర్చలు జరిపి ఏకాభిప్రాయానికి రావాలని సూచించింది. ఇరు రాష్ట్రాలు ఓ అంగీకారానికి రావాలని, అంతకుమించి మార్గం లేదని అభిప్రాయపడింది. నెల రోజుల్లో నిర్ణయం చెప్పాలని చెప్పింది.
కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరింత ముదిరినట్లే కనిపిస్తున్నాయి. కృష్ణా నదిపై తెలంగాణ సర్కారు నిర్మించతలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. ఈ రెండు ప్రాజెక్టుల కారణంగా ఏపీలోని రాయలసీమ ఎడారిగా మారిపోవడం ఖాయమని ఏపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
కృష్ణాపై తేలని పంచాయతీ: ఏపీ నేతల కుట్రలంటూ హరీశ్ ఫైర్
ప్రాజెక్టులను ఆపాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు వచ్చాయని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం.. ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలో ఇరు ప్రభుత్వాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇరు రాష్ట్రాలు కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డుకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో జరిగిన బోర్డు భేటీకి ఇరు రాష్ట్రాల సాగునీటి శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ భేటీలోనూ ఇరు వర్గాలు తమ తమ వాదనలనే వినిపించి ఏమాత్రం సామరస్యపూర్వక ధోరణిని ప్రదర్శించలేదు. దీంతో వరుసగా రెండో రోజు (బుధవారం) భేటీ అయ్యారు. కానీ, ఈ భేటీలోను ఎలాంటి పరిష్కారం దొరకలేదు.