గ్రేటర్ టిడిపి నాయకత్వంపై మాజీ మంత్రి అసంతృప్తి: బాబును కలిసే అవకాశం
హైదరాబాద్: గ్రేటర్ తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై ఆ పార్టీ నాయకుల్లో అసంతృప్తి నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ టిడిపి నాయకత్వంపై మాజీ మంత్రి కృష్ణయాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తన భవిష్యత్ కార్యచరణపై సోమవారం కార్యకర్తలతో సమావేశమైన కృష్ణయాదవ్.. గ్రేటర్లో పార్టీ చేపట్టే కార్యక్రమాలకు తనను ఆహ్వానించకపోవడంపై మనస్తాపం చెందారు. ఎమ్మెల్యేలు సాయన్న, మాగంటి గోపీనాథ్ వైఖరిని ఈ సందర్భంగా కృష్ణయాదవ్ తప్పుబట్టారు.
పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపులేదని కార్యకర్తల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పార్టీని వీడాలని ఆయనకు కార్యకర్తలు సూచించినట్లు తెలిసింది. తనకు జరుగుతున్న అవమానంపై నేడో రేపో టిడిపి అధినేత చంద్రబాబునాయుడును కృష్ణయాదవ్ కలిసే అవకాశం ఉంది.
ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లోని కొందరు ఎమ్మెల్యేలు, నేతలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన విషయం తెలిసిందే. కాగా, తాజా విభేదాల కారణంగా మరికొందరు కూడా టిడిపిని వీడే అవకాశాలు కన్పిస్తున్నాయి. గ్రేటన్ ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం తెలుగుదేశం పార్టీకి నష్టం చేసే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.