అసలు విషయం బయటపెట్టిన ఆర్.కృష్ణయ్య: పురంధేశ్వరితో భేటీ వెనుక!..
పురంధేశ్వరితో భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్నారు. తన కుమారుడి వివాహానికి పురంధేశ్వరి హాజరుకాలేకపోయారని, ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు ఆమె తమ ఇంటికి వచ్చారని అన్నారు
హైదరాబాద్: ఇద్దరు వేర్వేరు పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల మధ్య భేటీ అంటే.. సహజంగానే ఊహాగానాలకు కొదువ ఉండదు. ఇదే తరహాలో బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మధ్య జరిగిన భేటీ గురించి చాలానే ఊహాగానాలు వినిపించాయి.
ఆర్.కృష్ణయ్యను బీజేపీలోకి ఆహ్వానించడానికే పురంధేశ్వరి ఆయనతో భేటీ అయారని కొంతమంది, లేదు.. కాపులను బీసీల్లో చేరుస్తామన్న చంద్రబాబు హామిపై చర్చించడానికే భేటీ అయ్యారని మరికొంతమంది ఈ భేటీపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
అయితే అలాంటిదేమి లేదని భేటీ వెనుక అసలు కారణానన్ని వివరించారు ఆర్.కృష్ణయ్య. పురంధేశ్వరితో భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్నారు. తన కుమారుడి వివాహానికి పురంధేశ్వరి హాజరుకాలేకపోయారని, ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు ఆమె తమ ఇంటికి వచ్చారని అన్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆర్.కృష్ణయ్య విమర్శలు చేశారు.
ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తీవ్ర జాప్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని ఆయన నిరసించారు. ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది లేదని, డీఎస్సీ ప్రకటన పట్ల ఇంత జాప్యం జరగడమేంటని ప్రశ్నించారు. నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ఇప్పటికైనా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, లేనిపక్షంలో జూన్ రెండో వారం నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన హెచ్చరించారు.