1274కోట్లు: అమెరికాలో కెటిఆర్ బిజీ(పిక్చర్స్)
న్యూయార్క్: తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తన రెండవ రోజు అమెరికా పర్యటనలో న్యూయార్క్లోని డీఈ షా కంపెనీ ఎండీ ఎరిక్ వెప్సిక్తో ఆ సంస్థ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గత ఇరవై ఏళ్ళుగా హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం మరింత సహాయం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
డీఈ షా కంపెనీని హైదరాబాద్లో విస్తరించాలని కోరగా.. ఎరిక్ వెప్సిక్ అంగీకరించారు. బ్లాక్స్టోన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీతో కలిసి తమ కంపెనీ ఏర్పాటుచేస్తున్న అర్కిసియం అనే సబ్సిడరీ సంస్థద్వారా హైదరాబాద్లో 200 మిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఎరిక్ వెప్సిక్ తెలిపారు.
భారత కరెన్సీలో ఇది ప్రస్తుత డాలర్ మారకం విలువ ప్రకారం సుమారు 1274 కోట్ల రూపాయలతో సమానం. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు సాఫ్ట్వేర్ సేవలందించే ఈ నూతన కంపెనీద్వారా 400 మందికి ఉపాధి లభించనుందని ఎరిక్ తెలిపారు. రాబోయే మూడేళ్లలో ఈ సామర్థ్యం రెట్టింపు అవుతుందని, కొత్త కంపెనీని హైదరాబాద్లో త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రికి వివరించారు. ఎరిక్ వెప్సిక్ను కలిసిన వారిలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా ఉన్నారు.
మాస్టర్ కార్డ్ సిఈఓతో..
తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తన రెండవ రోజు అమెరికా పర్యటనలో న్యూయార్క్లోని డీఈ షా కంపెనీ ఎండీ ఎరిక్ వెప్సిక్తో ఆ సంస్థ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఫ్రాంక్ విన్సర్తో
ఈ సందర్భంగా గత ఇరవై ఏళ్ళుగా హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం మరింత సహాయం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
ఎరిక్ వెప్సిక్ ఢిఈ షాతో
డీఈ షా కంపెనీని హైదరాబాద్లో విస్తరించాలని కోరగా.. ఎరిక్ వెప్సిక్ అంగీకరించారు.
మాస్టర్ కార్డ్ సిఈఓతో
బ్లాక్స్టోన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీతో కలిసి తమ కంపెనీ ఏర్పాటుచేస్తున్న అర్కిసియం అనే సబ్సిడరీ సంస్థద్వారా హైదరాబాద్లో 200 మిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఎరిక్ వెప్సిక్ తెలిపారు.
తెలంగాణ సర్కారుతో జట్టుకట్టనున్న మాస్టర్ కార్డ్:
అనంతరం మాస్టర్ కార్డ్ సంస్థ అధ్యక్షుడు అజర్ బంగాతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంలో చేపట్టిన కార్యక్రమాలను కేటీఆర్ వివరించగా.. మాస్టర్ కార్డ్ అధ్యక్షుడు అభినందించారు.
సైబర్ సెక్యూరిటీ రంగంలో పలు ప్రైవేటు సంస్థలను కలుపుకొని తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అజయ్ బంగా తెలిపారు. కేవలం సంస్థలకు, ప్రభుత్వాలకే కాకుండా కోట్లమందికి పౌరులకుసైతం సైబర్ సెక్యూరిటీ సవాలుగా ఉందని, అలాంటి అంశంపై మాస్టర్ కార్డ్లాంటి సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తుందంటూ మంత్రి సానుకూలంగా స్పందించారు.
గుడ్విల్ అంబాసిడర్గా అమెరికా మాజీ రాయబారి:
భారత్లో అమెరికా మాజీ రాయబారి, మేథో సంపత్తి హక్కుల రంగంలో ప్రముఖుడైన ఫ్రాంక్ విన్సర్తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్లోని చారిత్రక కట్టడాల రక్షణకోసం, డెక్కన్ హెరిటేజ్ ఫౌండేషన్ పేరుతో సేవలందిస్తున్న విన్సర్ను తెలంగాణ రాష్ర్టానికి గుడ్విల్ అంబాసిడర్గా ఉండాలని మంత్రి కోరారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన విన్సర్ తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు సేవలందిస్తానని హామీ ఇచ్చారు. తనకున్న అంతర్జాతీయ సంబంధాలను ఇందుకు ఉపయోగిస్తానని ఫ్రాంక్ విన్సర్ తెలిపారు.
ప్రముఖ ఆర్థిక సంస్థ కేపీఎంజీ కేంద్ర కార్యాలయంలో కేపీఎంజీ సంస్థల చైర్మన్ జాన్వేహ్ మేయర్తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను, ఆలోచనలను మంత్రి వివరించారు. తమ సంస్థ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అనేక ప్రభుత్వాలతో పెట్టుబడుల రంగంలో కలిసి పనిచేస్తున్నదని చెప్పారు. 2015 ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరుగబోయే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ గురించి మంత్రి కేపీఎంజీ సంస్థల చైర్మన్కు వివరించగా.. ఆ సమ్మిట్కు నాలెడ్జ్ పార్ట్నర్గా వ్యవహరించేందుకు చైర్మన్ అంగీకరించారు.
టీహబ్ మెంటర్గా ప్రధానమంత్రి టాస్క్ ఫోర్స్ సభ్యుడు:
ప్రపంచవ్యాప్తంగా 300 స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన న్యూ సిల్క్ రూట్ కంపెనీ సీఈవో, ప్రధానమంత్రి టాస్క్ఫోర్స్ సభ్యుడు అయిన పారగ్ సక్సేనాను మంత్రి కేటీఆర్ కలిశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీ హబ్ కార్యక్రమాన్ని అభినందించిన సక్సేనా.. టీ-హబ్లో మెంటర్గా ఉండేందుకు ముందుకువచ్చారు.
మంత్రిని కలిసిన తానా, ఆటా ప్రతినిధులు:
తన పర్యటనలో భాగంగా యూఎస్టీ గ్లోబల్, మెరిల్ లించ్, సిటీ బ్యాంక్, వాటర్ హెల్త్లాంటి కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సమయంలోనే తానా, ఆటా ప్రతినిధులు మంత్రిని కలిశారు. తానా అధ్యక్షుడు సతీశ్ వేమన మంత్రికి స్వాగతం పలికారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో కలిసి రావాలని వారికి మంత్రి పిలుపునిచ్చారు. సాయంత్రం న్యూయార్క్నుంచి బయలుదేరి న్యూజెర్సీలోని ఎన్నారైలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.