ఉదయాన్నే వార్త చూసి షాకయ్యా, ఎప్పుడేం జరుగుతుందో: అశోక్ గజపతి రాజుపై కేటీఆర్
హైదరాబాద్: టీడీపీ నేత అశోక్ గజపతి రాజు రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తను చూసి తాను షాకయ్యానని తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం అన్నారు. ఆయన బేగంపేటలోని వింగ్స్ ఇండియా సదస్సుకు హాజరయ్యారు.
Recommended Video
ఈ సందర్భంగా మాట్లాడారు. అశోక్ గజపతి రాజు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉందని, కానీ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కేంద్రమంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమయ్యారన్నారు.
రాజకీయాల్లో ఏం జరుగుతుందో చెప్పలేం
అశోక్ రాజీనామా నేపథ్యంలో రాలేకపోయారని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమని, ఎవరం కూడా చెప్పలేమని కేటీఆర్ అన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు సేవలు ప్రశంసనీయమన్నారు.
వార్త చూసి షాకయ్యానని కేటీఆర్
ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగిందని, తమ డిమాండ్లు నెరవేర్చాలని టీడీపీ నేతలు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు కేంద్రమంత్రి పదవులకు గురువారం సాయంత్రం రాజీనామా చేయగా, ఆమోదించారు. అంతకుముందే ఉదయం కేటీఆర్ మాట్లాడారు. ఉదయం పేపర్లో రాజీనామా చేస్తారనే వార్త చూసి షాకయ్యానన్నారు.
అశోక్ గజపతి రాజు హయాంలో ఇలా అభివృద్ధి
ఉదయం లేవగానే పత్రికల్లో అశోక్ గజపతిరాజు రాజీనామా వార్త చూసి తాను ఖంగుతిన్నానని, దేశంలో 70 ఏళ్లలో 70 విమానాశ్రయాలు ఉంటే అశోక్ గజపతి రాజు సారథ్యంలో గడిచిన మూడేళ్లలో 50 నుంచి 60కిపైగా విమానాశ్రయాలు కొత్తగా ఏర్పాటయ్యాయని కేటీఆర్ ప్రశంసించారు. భారత వైమానిక రంగం ఇలాగే వృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
రెండు పార్టీలదే కాదు
కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ.. దేశం రెండు పార్టీలది మాత్రమే కాదని, మూడో కూటమి ఏర్పాటే ప్రత్యామ్నాయమని అన్నారు. మన దేశంలో అనేక పార్టీలు ఉన్నాయని, మనది రెండు పార్టీల ప్రజాస్వామ్యం కాదని, ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ఉన్నాయన్నారు. వింగ్స్ ఇండియా సదస్సులో పాల్గొన్న ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
మూడో కూటమి ప్రత్యామ్నాయం
ప్రస్తుత పరిస్థితుల్లో మూడో కూటమి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. ఎన్నికలకు మరో ఏడాది కాలం ఉన్నదని, మున్ముందు సమీకరణలు ఎలా మారుతాయో చూడాలన్నారు. కేసీఆర్ చెప్పినట్లుగా దేశ ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు అనేకసార్లు అవకాశాలు ఇచ్చారని, కానీ ఆ పార్టీలు ప్రజల ఆశయాలను తీర్చడంలో విఫలమయ్యాయన్నారు.