సిగ్గు, శరం ఉందా?, ఒళ్లు దగ్గర పెట్టుకోండి: జైరాం, డిగ్గీ, ఉత్తమ్లకు కేటీఆర్ హెచ్చరిక
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉనికి కోసమే విపక్షాలు తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తు
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉనికి కోసమే విపక్షాలు తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని, చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
మాజీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి కుమారుడి సంస్థ నుంచి వాహనాలను కొనుగోలు చేశారన్న జైరాం ఆరోపణల్లో వాస్తవం లేదని కేటీఆర్ అన్నారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ డీజీఎస్ఎన్డీ ప్రకారమే వాహనాలను నేరుగా తయారీ కంపెనీ నుంచే కొనుగోలు చేశామని కేటీఆర్ చెప్పారు. యూపీఏ ఖరారు చేసిన ధరలకే కొనుగోలు చేశామని చెప్పారు.
జైరాంపై ఇలా..
అసలు జైరాం రమేష్ ఎప్పుడైనా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు కొడుకు, కేసీఆర్ కొడుకు అని ఆరోపణలు చేస్తే కుదరదని, ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. తనకు కంపెనీ ఉందని ఆరోపిస్తున్నారని, అది నిరూపిస్తే తాను ఉత్తమ్ కో, జైరాం కో రాసిస్తానని అన్నారు.
జైరాం ప్రతిభాపాఠవాలకు చేతులెత్తి దండం పెట్టాల్సిందేనని, ఆయన కర్మ అనుకోవాల్సిందేనని చెప్పారు. అన్ని లత్కోర్ ఆరోపణలు చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారిందన్నారు. వెంకయ్యనాయుడు కుమార్తెకు చెందిన స్వర్ణభారతికి మినహాయింపులు ఇచ్చారని జైరాం అంటున్నారని చెప్పారు.
Recommended Video
బాలయ్య ఆస్పత్రికీ ఇచ్చాం..
ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలకు పన్ను మినహాయింపులు ఇవ్వడం సాధారణ విషయమని కేటీఆర్ తెలిపారు. గొప్ప మేధావి జైరాంకి ఈ విషయం తెలియదేమోనని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్వచ్ఛంద సంస్థలకు మినహాయింపులు ఇచ్చిందని చెప్పారు. స్వచ్ఛంద సంస్థ కింద స్వర్ణ భారతికి రూ.2కోట్లు, నందమూరి బాలకృష్ణకు చెందిన బసతారకం ఆస్పత్రికి రూ.5కోట్ల మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. తామిచ్చిన వాటిలో ఇదే ఎక్కువ మొత్తమని తెలిపారు.
లూట్ జూట్ స్కూట్...
కాంగ్రెస్ లూట్ జూట్ స్కూట్ విధానాన్ని పాటిస్తోందని, ఈ విధానంలో దోచుకోవడం, బురదజల్లడం, పారిపోవడం లాంటివే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వారికే చెల్లుతుందని అన్నారు. అదో పార్టీ, ఆయనో నేత అంటూ కాంగ్రెస్, జైరాంపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాను ఆధారాలతో మాట్లాడుతున్నానని తెలిపారు. వారిని కూడా ఆధారాలతో మాట్లాడమని అడుగుతున్నానని చెప్పారు. కామన్ సెన్స్ ఉంటే స్పందించాలని జైరాంకు సవాల్ విసిరారు. లేదంటే క్షమాపణలను చెప్పాలని డిమాండ్ చేశారు.
సిగ్గు, శరం, బుద్ధి జ్ఞానం ఉందా?
సిగ్గుశరం, బుద్ధి జ్ఞానం ఉంటే క్షమాపణలు కోరాలని అన్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడతామంటే కుదరదని హెచ్చరించారు. మాజీ సీఎం అయినా, మాజీ కేంద్రమంత్రి అయినా ఊరుకునేది లేదంటూ డిగ్గీ, జైరాంలపై ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పనేలేదని ఎద్దేవా చేశారు. దళితుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదని స్పష్టం చేశారు. సిరిసిల్లలో దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ ఉత్తమ్ ఆరోపణలు చేయడంపై తీవ్రంగా స్పందించారు కేటీఆర్. దళితులపై దాడులు జరిగింది కాంగ్రెస్ హయాంలోనేనని అన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఈ సందర్భంగా ఉత్తమ్ను హెచ్చరించారు. ఇసుక కుంభకోణాలు చేసింది కాంగ్రెస్సేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక ద్వారా ఏడాదికి రూ.10 కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు రూ. 300కోట్లకుపైగా వస్తోందని చెప్పారు. సిరిసిల్లకు పోయి ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. వెధవలమని చెప్పుకుంటారా? అని దుయ్యబట్టారు. సిరిసిల్ల నేతలను ఆదుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని అన్నారు.