వరంగల్ ఎన్నికపై ప్రభావం ఉంటుందా? నితీష్కు కెటిఆర్ అభినందన, మజ్లిస్కు బీహార్లో ఓట్లు
హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్డీయే సమీక్షించుకోవాల్సి ఉందని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ ఆదివారం అన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఫలితాలు వచ్చాయన్నారు.
బీహార్ ఎన్నికల ప్రభావం వరంగల్ ఉప ఎన్నిక మీద ఏమాత్రం ఉండబోదని చెప్పారు. బిహార్లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించపోవడం ఫలితాలపై ప్రభావం చూపిందని ఎల్ రమణ అభిప్రాయపడ్డారు.
మోడీ వైఫల్యం: అసదుద్దీన్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఓడిపోవడం ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని మజ్లిస్ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సీమాంచల్ ప్రాంతంలో మజ్లిస్ పార్టీ సభ్యులకు ఓట్లు వేసిన ప్రజలకు అసదుద్దీన్ ధన్యవాదాలు అన్నారు. వచ్చే ఎన్నికల సమయానికి బీహార్లో మజ్లిస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు.
నితీష్కు కెటిఆర్ అభినందనలు
అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. ఆయన నితీష్ కుమార్కు అభినందనలు తెలిపారు. ఎన్డీయే లోటుపాట్లను సరి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
గాంధీ భవన్లో మిఠాయిలు పంచుకొని, టపాసులు పేల్చారు
బీహార్లో మహా కూటమి గెలుపు నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు గాంధీ భవన్లో టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... ప్రధాని ప్రతిష్టను మోడీ దిగజార్చారన్నారు. బీహార్లో బిజెపి చీఫ్ అమిత్ షా వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు.