నా మాటా లెక్క చేయొద్దు, నేను కేసీఆర్ కొడుకునైనా: కేటీఆర్
హైదరాబాద్: మా పార్టీకి చెందిన కార్పోరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు.. చివరకు మున్సిపల్ మంత్రిగా తాను, ఇంకా చెప్పాలంటే విపక్షాలు అడ్డుకున్నా సరే అక్రమ కట్టడాల కూల్చివేతలు ఆగవని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు.
ఎవరు ఆపినా, ఎవరు అడ్డుకున్నా తాము పట్టించుకోమని చెప్పారు. అన్నీ కూల్చేస్తామన్నారు. తాము పేదవారి గుడిసెలు కూల్చడం లేదని, నాలాల పైన అక్రమ నిర్మాణాలనే లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు. పేదల ఇళ్లు కూల్చవలసి వస్తే వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.
చెరువుల రక్షణకు ఆధునిక టెక్నాలజీ
చెరువులకు జియో ఫెన్సిక్ చేస్తున్నామని, ఎవరైనా ఆక్రమిస్తే అధికారులకు సంక్షిప్త సమాచారం అందుతుందన్నారు. తాను కేబినెట్ మంత్రిని అని, అందులోను ముఖ్యమంత్రి కొడుకుని అని, అయినా పక్షపాతం లేదన్నారు.
శాస్త్రీయంగా కొత్త జిల్లాల ఏర్పాటులో సిరిసిల్లకు చోటు కల్పించలేదని చెప్పారు. సిరిసిల్లలో కలపడానికి 9 మండలాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయని, అదీ కాక 5 లక్షల జనాభా మాత్రమే సిరిసిల్లకు అనుకూలంగా ఉందని చెప్పారు. తాను జిల్లా కోసం ప్రతిపాదించినప్పటికీ శాస్త్రీయంగా సాధ్యం కాలేదన్నారు.