భువనేశ్వరి ఓటు వేయకున్నా ఏం కాదు, అమెకు అన్నీ తెలుసనే: కెటిఆర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఓటు తమ పార్టీ గెలుపు పైన ప్రభావం చూపదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
భువనేశ్వరి తమకే ఓటే వేస్తానని చెప్పారని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగ సభా వేదికగా ప్రకటించారు. దీనిపై ఆమె స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. తన ఓటు ఎప్పటికీ టిడిపికేనని చెప్పారు. ఆమె కొడుకు నారా లోకేశ్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా కెటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు తమకు నారా భువనేశ్వరి ఓటే అవసరం లేదన్నట్లుగా కేటీఆర్ మాట్లాడారు. ఆయన ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.
చంద్రబాబు విజయవాడలో ఉంటున్నారని, ఇక్కడి పరిస్థితులు ఆయనకు తెలియవని, కానీ, భువనేశ్వరి ఇక్కడే ఉండి వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఆమెకు అన్నీ తెలుసనని, అందుకే ఆమె తెరాసకు ఓటు వేస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారని, అయినా, ఆమె ఒక్క ఓటు వేసినా, వేయకపోయినా టీఆర్ఎస్ గులుపుపై ఏమాత్రం ప్రభావం ఉండదన్నారు.