యుపి సిఎంకు అర్థమైంది, పక్కనే ఉన్న జానాకు అర్థం కాలేదు: కెటిఆర్
నల్లగొండ: వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు అర్థమైంది గానీ పక్కనే ఉన్న ప్రతిపక్ష నేత జానా రెడ్డికి అర్థం కాలేదు తెలంగాణ పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి కెటి రామారావు వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లా పానగల్లు ఉదయసముద్రం దగ్గర వాటర్గ్రిడ్ ప్రాజెక్టు పనులకు మంత్రులు కేటీఆర్, జగదీష్రెడ్డి, లకా్ష్మరెడ్డిలు శనివారంనాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కెటిఆర్ మాట్లాడారు.
తాము ముందుకు సాగుతుంటే ప్రతిపక్షాలు కాళ్లలో కట్టెలు పెట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇంటింటికీ నీరు అందిస్తామని, ప్రతిపక్షాలకు మాత్రం మూడు చెరువుల నీళ్లు తాగిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకుల సన్నాయి నొక్కులను, కప్పిగంతులను ప్రజలు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
తాము సార్ అని పిలిపించుకునే స్థాయికి రాలేదని, అలా మారం కూడా అని, తాము అన్నా అనే పిలిపించుకుంటామని ఆయన చెప్పారు. రైతులకు ఈ 15 నెలల్లోనే సమస్యలు వచ్చినట్లు కాంగ్రెసు నాయకులు మాట్లాడుతున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెసు 42 ఏళ్లు, టిడిపి 17 ఏళ్లు పాలించాయని, రైతుల సమస్యలు ఆ పార్టీల పుణ్యమేనని ఆయన అన్నారు.
రైతు సమస్యలు తీర్చే బాధ్యత తమపై ఉందని, బాధ్యత ఉంది కాబట్టే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. గత కాంగ్రెసు కేంద్ర ప్రభుత్వం 55 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తే తెలంగాణకు 3 వేల కోట్ల మాఫీ మాత్రమే అమలైందని, తాము 17 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని, వాటిని విడతలుగా చెల్లిస్తున్నామని, ఇప్పటికే సగం చెల్లించామని ఆయన చెప్పారు. కాంగ్రెసు నాయకులు ఎవరు కూడా తెలంగాణ కోసం పనిచేసినవారు కాదని, తెలంగాణ వస్తే ముఖ్యమంత్రి అవుదామని మాత్రమే అనుకున్నారని ఆయన అన్నారు.
నల్లగొండ జిల్లా నాశనానికి కాంగ్రెసు, టిడిపిల కారణమని విద్యుత్శాఖ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. రైతు భరోసాయాత్రల పేరుతో ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై ప్రతిపక్షాలు అనవసరమైన విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని, 60 ఏళ్లుగా నల్లగొండ జిల్లాను ఆగం చేశారని ఆయన అన్నారు.
అవినీతికి కేరాఫ్ అడ్రస్సే కాంగ్రెస్ పార్టీ అని, పాత భూస్వామ్య పద్దతులు తేవడానికి విపక్షాలు కుట్ర చేస్తున్నాయని, ప్రాజెక్టులపై చర్చకు మేం సిద్దం మీరు సిద్దమామా అని, అసెంబ్లీలో చర్చించ చేతకాక రోడ్లపై పడ్డారని ఆయన అన్నారు.