తన పుట్టిన రోజున ఆ గిఫ్ట్ ఇవ్వండన్న కేటీఆర్ .. ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఎంపీ సంతోష్
నేడు జులై 24.. టీఆర్ఎస్ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని తాకుతున్న రోజు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , కేసీఆర్ తనయుడు అయిన కేటీఆర్ పుట్టిన రోజు . చాలా అట్టహాసంగా జరుగుతాయనుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పుట్టినరోజు వేడుకలు ఈసారి మరింత వినూత్నంగా జరగబోతున్నాయి. తన బర్త్డేలకు గిఫ్ట్లు, బొకేలు తీసుకురావద్దు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పెట్టద్దు...ఒక మొక్క నాటండి చాలు అంటూ గత కొన్నేళ్లుగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సంవత్సరం కాస్త వినూత్నంగా అయన పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు అభిమానులు .
కేటీఆర్ నయా లుక్.. ఫ్యాన్స్ సందడి.. తారకరాముడు హ్యాపీ..!
కేటీఆర్ బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ అంటున్న ఫ్యాన్స్ .. సహాయ కార్యక్రమాల్లో బిజీ బిజీ
కేటీఆర్ బర్త్డే సందర్భంగా #Giftasmile సోషల్ మీడియాలో భారీగా ప్రచారం అవుతోంది. కేటీఆర్ పుట్టిన రోజున మనం 'ఒకరికి సాయం చేద్దాం..మరొకరి చేత సాయం చేయిద్దాం..'అంటూ క్యాంపెయిన్ చేపట్టారు ఫ్యాన్స్. కేటీఆర్ మంచి నాయకుడు, దార్శనికుడే కాదు, మంచి మానవతావాది కూడా అని తెలియజేయటం కోసం ఆయన ఫ్యాన్స్ ఇలా నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్లో ఏదైనా సమస్య గురించి ట్వీట్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయి బాధితులకు సాయం చేసేవారు కేటీఆర్ అని అందరికీ తెలుసు. ఒక్క తెలంగాణ కే కాకుండా ,ఏపీ ప్రజలకు ప్రాంతీయబేధం లేకుండా సాయం చేసేవారు కూడా కేటీఆర్ నే . ఇదే కాన్సెప్ట్తో ఈ సారి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కేటీఆర్ అభిమానులు #Giftasmile పేరుతో 'ఒకరికి సాయం చేసి , మరొకరి చేత సాయం చేయిద్దాం' అనే నినాదంతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టి, కేటీఆర్ బర్త్డేను వినూత్నంగా జరుపుకోనున్నారు.
ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఎంపీ సంతోష్ .. కీసరగుట్ట రిజర్వు ఫారెస్ట్ దత్తత నిర్ణయం
కేటీఆర్ బర్త్ డే కి ఎవరూ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ .. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కీసరగుట్ట రిజర్వు ఫారెస్ట్ను దత్తత తీసుకుంటున్నట్టు ఆ పార్టీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రకటించారు. ఎంపీ నిధులతో 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం ప్రాజెక్టుగా మార్చి హైదరాబాద్ వాసులకు గిఫ్ట్గా ఇస్తానని ఆయన ప్రకటించారు . ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. అటవీ ప్రాంతాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలంటూ పలువురిని ఆయన పెట్టిన పోస్ట్ కు ట్యాగ్ చేశారు. కేటీఆర్, కవిత, దర్శకుడు పైడిపల్లి వంశీ, నటులు దేవరకొండ విజయ్, నితిన్, పారిశ్రామికవేత్త ముత్తా గోపాల్ను ట్యాగ్ చేసిన ఆయన కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ‘గిఫ్ట్ ఎ స్మైల్' కార్యక్రమంపై స్పందిస్తూ తన దత్తత నిర్ణయాన్ని ప్రకటించారు.
సహాయ కార్యక్రమాల్లో కేటీఆర్ అభిమానులు .. నేడే కేటీఆర్ పుట్టిన రోజు
ఇక నేడు జులై 24 కేటీఆర్ బర్త్డే సందర్భంగా పూల బొకేలు, పేపర్ యాడ్స్ కాకుండా అవసరంలో ఉన్న వారికి సాధ్యమైనంత సాయం చేయాలనే సదుద్దేశంతో స్టార్ట్ చేసిన గిఫ్ట్ ఏ స్మైల్ కు విపరీతమైన ప్రజాదరణ ఉంది. సోషల్ మీడియా లో ఇప్పుడు ఇది హల్ చల్ చేస్తుంది. గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ లో భాగంగా టీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్ అభిమానులు ఇప్పటికే సహాయ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రూ.10 లక్షల చెక్కును అంబులెన్స్ కొనుగోలు నిమిత్తం స్వచ్ఛంద సంస్థకు అందజేశారు. శిరీష్ రావు అనే ఎన్నారై అమెరికన్ కేన్సర్ సొసైటీకి 250 యూఎస్ డాలర్లను విరాళం ఇచ్చారు . మరో ఎన్నారై శశి కనపర్తి నిశాంత్ కేన్సర్ ఫౌండేషన్ కు 500 యూఎస్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఇక రక్త దాన శిబిరాలు చాలా చోట్ల ఏర్పాటు చేశారు .