కెసిఆర్ ‘హామీ’లు నీటిమీద రాతలు: చేనేత నుంచి అన్నీ....
అందరికీ మరమగ్గాలు ఇస్తాం ఎన్నికల్లో హామీ.. కాదు కాదు లాటరీ ప్రకారం పంపిణీ చేస్తామన్న టైక్స్టైల్స్ శాఖ అధికారులు.. ఏటా 100 మందికి పంపిణీ చేస్తామని తాజాగా సర్కార్ ప్రకటించింది.
హైదరాబాద్: అందరికీ మరమగ్గాలు ఇస్తాం ఎన్నికల్లో హామీ.. కాదు కాదు లాటరీ ప్రకారం పంపిణీ చేస్తామన్న టైక్స్టైల్స్ శాఖ అధికారులు.. ఏటా 100 మందికి పంపిణీ చేస్తామని తాజాగా సర్కార్ ప్రకటించింది. ఇలా ఏటా 100 మంది నుంచి 200 మందికి మాత్రమే మర మగ్గాలు పంపిణీ చేస్తే సిరిసిల్ల జిల్లా పరిధిలోని తమకందరికీ మర మగ్గాలు ఎప్పుడు వస్తాయని చేనేత కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
మూడున్నరేళ్ల క్రితం 2014 సార్వత్రిక ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన రాష్ట్ర పరిశ్రమలు, మున్సిపల్, చేనేత శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నియోజకవర్గ ప్రజలందరికీ నాలుగు మరమగ్గాల చొప్పున అందిస్తాం.. తద్వారా కార్మికులందర్నీ యజమానులుగా మారుస్తాం' అని వాగ్ధానం చేశారు.
కానీ ఎన్నికలు జరిగి, తెలంగాణలో తొలి సర్కార్ కొలువు దీరి మూడున్నరేండ్లు దాటింది. అయినా మంత్రి వాగ్దానం నేటికీ నెరవేర లేదు. దీంతో సిరిసిల్లలోని మరమగ్గం కార్మికులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
సిరిసిల్లలో 60 వేల మంది నేత కార్మికుల జీవనం
మరోవైపు ప్రభుత్వం తాజాగా.. ఒకేసారి అందరికీ మగ్గాలను ఇవ్వలేమని ప్రకటించటంతో వారు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేనేత కార్మికులకు వర్క్షెడ్లు ఏర్పాటు చేసేందుకోసం సర్కారు కొంత భూమిని సేకరించింది. మగ్గాలను అందించేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నా అది కార్యరూపం దాల్చకపోవటం గమనార్హం. జిల్లా కేంద్రం సిరిసిల్ల పట్టణంలోనే దాదాపు 40వేల మంది మర మగ్గం కార్మికులు ఉన్నారు. చుట్టుపక్కల కలిపి మరో 20 వేల మంది నేతన్నలున్నారు. మొత్తం 60 వేల మంది చేనేత కార్మికులు ఉంటారని అంచనా.
20 శాతం కార్మికుడు.. ప్రభుత్వ సబ్సిడీ 50%
వీరందరికీ ఒక్కొక్కరికి నాలుగు మరమగ్గాలను అందజేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఒక్కో మగ్గం ధర కనిష్టంగా రూ.50 వేల నుంచి గరిష్టంగా రూ.4 లక్షల వరకూ (మగ్గం రకాన్నిబట్టి) ఉంటుంది. వీటిలో జెట్, ఎయిర్ జెట్లూమ్, సెమీ ఆటోమేటిక్ తదితర రకాల మర మగ్గాలు ఉన్నాయి. వీటి మొత్తం ధరలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ భరిస్తే.. 30 శాతం బ్యాంకుల నుంచి రుణాల రూపంలో అందిస్తారు. మరో 20 శాతాన్ని కార్మికుడు భరించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. ఇందుకనుగుణంగా ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినా అమలుకు నోచుకోలేదు.
200 మందికి పంపిణీచేస్తే అందరికీ అందేదెన్నడో మరి?
మరోవైపు కార్మికులందరికీ ఒకేసారి మరమగ్గాలను పంపిణీ చేయలేమంటూ ప్రభుత్వం ప్రకటించటంతో ఇప్పుడు నేతల్లో ఆందోళన నెలకొంది. ఏడాదికి 100 నుంచి 200 మందికి చొప్పున మగ్గాలను అందజేస్తామని చేనేత శాఖ అధికారులు ప్రకటించారు. ఇందుకోసం లాటరీ పద్ధతిని అనుసరిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో మొత్తం 60 వేల మంది కార్మికులకు ఎప్పుడు మగ్గాలిస్తారు? వారందరూ యజమానులుగా ఎప్పుడు మారతారు? అంటూ చేనేత నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర చేనేత శాఖ మంత్రి కేటీఆర్ గతంలో హామీకి కట్టుబడి సిరిసిల్ల లోని నేత కార్మికులందరికీ ఒకేసారి మరమగ్గాలను అందజేయాలని చేనేత కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నది.
ఇప్పుడు ఉన్న మాస్టర్ వీవర్లకే మళ్లీ మరమగ్గాలను అందజేస్తారే తప్ప నిజమైన కార్మికుడికి ఒరిగేదేమీ ఉండబోదని చేనేత రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అందువల్ల మగ్గాల పంపిణీ సందర్భంగా కార్మికులపై దృష్టి సారించి అవి వారికే అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతే కాదు కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం కరీంనగర్ నగరంలో ‘ఐటీ హబ్' ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ కూడా కొండెక్కింది. ఇప్పుడు దాని ఊసే మరిచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాకో మెడికల్ కాలేజీ ఇక పగటి కలేనా?
ఇక 2014లో సీఎంగా పగ్గాలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరీంనగర్ జిల్లాలో పర్యటించినప్పుడు జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటానని హామీలు గుప్పించారు. కానీ తీరా ఆచరణలోకి వచ్చే సరికి గత ఏడాది విజయదశమి సందర్భంగా ఏర్పాటైన ‘సిద్దిపేట' కేంద్రంగా 2018 - 19 విద్యాసంవత్సరంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవలే నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని త్వరలో సీఎం కేసీఆర్ విధాన ప్రకటన చేయనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 31 జిల్లా కేంద్రాల్లో కొన్ని చోట్ల మాత్రమే తక్షణం వైద్య కళాశాలల ఏర్పాటుకు అవసరమైన భూమిక ఉన్నది. అటువంటి వసతులు ముందు కల్పిస్తే గానీ తర్వాత మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం భారత వైద్య మండలి (ఎంసీఐ) అనుమతి కోరాల్సి ఉంటుంది. హామీ ఇచ్చిన కరీంనగర్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికే దిక్కు లేదు కానీ కొత్త జిల్లా కేంద్రాల్లో వైద్య కళాశాలల ఏర్పాటు ప్రక్రియ అరచేతిలో వైకుంఠమేనని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.