వ్యాధితో కొడుకు, తండ్రి ఆవేదన: స్పందించిన కేటీఆర్, అంత డబ్బు సాధ్యం కాదని..!
హైదరాబాద్: ఈ పేదోడీ రోదన పట్టదా అంటూ నిలదీసిన రాజేందర్ రెడ్డి ఆవేదనపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. తన కొడుకు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేయడంతో కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.
విషాదగాథ: పేదోడీ రోదన పట్టదా, కేటీఆర్ వచ్చాడని తెలిసి పరుగెత్తుకుంటూ వస్తే!
బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆ బాలుడిని కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు. తాండూరు ప్రాంతానికి చెందిన రాజేందర్ రెడ్డి రామచంద్రాపురం ప్రాంతంలో ఉంటున్నారు. ఆయన సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. అతని కుమారుడు మదన్ రెడ్డి బోన్ క్యాన్సర్తో నల్లగండ్ల సిటిజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మీడియాతో బాధ చెప్పుకున్నాడు
ఆసుపత్రి వర్గాలు రూ.30లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో రాజేందర్ రెడ్డి ఇప్పటికే అప్పులు చేసి, ఇతరుల సాయంతో రూ.5 లక్షళ వరకు ఖర్చు పెట్టాడు. ఈ పరిస్థితిలో మంగళవారం మంత్రి కేటీఆర్ నల్లగండ్ల వస్తున్నారని తెలిసి తన కష్టం ఆయనకు చెప్పుకోవాలని వచ్చిన అతడిని పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర ఆవేదనతో రోదిస్తూ తమ బాధను మీడియాతో చెప్పుకున్నారు.
సాయం దిశగా కేటీఆర్
విషయం తెలుసుకున్న కేటీఆర్ వెంటనే సహాయం దిశగా స్పందించారు. ఈ మేరకు తన కార్యాలయం అధికారులను ఆదేశించడంతో వారు బుధవారం బాలుడి తండ్రి రాజేందర్ రెడ్డిని సచివాలయానికి రావాలని తెలిపారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అంతమొత్తం సాధ్యం కాదు కాబట్టి
అంత మొత్తం ప్రభుత్వ తరపున అందించడం సాధ్యం కాదు కాబట్టి ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులను సంప్రదించి పరిస్థితిని తెలిపారు. సీఎంవో అధికారులు ఆ బాలుడిని నిమ్స్లో చేర్పించి చికిత్స అందించేలా చర్యలు తీసుకుందామని తెలిపారు.
రాజేందర్ రెడ్డి ఆనందం
ఈ మేరకు గురువారం నిమ్స్ రావాలని వారు రాజేందర్ రెడ్డికి సూచించారు. తన ఒక్కగానొక్క కుమారుడిని కాపాడుకునేందుకు కేటీఆర్ ముందుకు రావడంతో రాజేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.