త్వరలో ప్రపంచస్థాయి ఫార్మాసిటీ.. రెచ్చగొట్టే నేతలతో.. ప్రజల్లో ఆందోళనకు కారణమదే: కేటీఆర్
అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా పారిశ్రామిక విధానం ఉండాలని తెలంగాన మంత్రి కే తారకరామారావు అన్నారు. టీఎస్ఐపాస్కు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతితోపాటు భారీ తరహా పరిశ్రమలు ఉండాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
బెంగళూరుకు ధీటుగా హైదరాబాద్.. 4 ఏళ్లలో 3 లక్షల మందికి ఉపాధి: కేటీఆర్
ప్రపంచదేశాలతో పోటీపడేలా
చైనా, ఇతర దేశాలతో పోటీ పడేలా ఫార్మా సిటీని రూపొందించబోతున్నాం. భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ను హైదరాబాద్ ఫార్మాసిటీ పేరుతో నిర్మించబోతున్నాం. 10 వేల ఎకరాల భూమిని రంగారెడ్డి జిల్లాలో సేకరించాం. రైతుల ఆశీర్వాదంతో ప్రాజెక్టుకు భూసేకర చేపట్టాం. మరో రెండు వేల ఎకరాలను సేకరించి అతి త్వరలోనే ఫార్మా సిటీని రూపొందించబోతున్నాం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం
ఇతర ప్రాంతాల్లో భారీ ఫార్మా సిటీని నెలకొల్పాలంటే పర్యావరణ, అనేక సమస్యలు ఉంటాయి. కానీ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఇలాంటి బృహత్తర పథకానికి ఎలాంటి సమస్యలు లేవు అని మంత్రి కేటీఆర్ అన్నారు. భూసేకరణ పూర్తి కాగానే.. తొలి రోజునే పని మొదలుపెట్టేలా ప్రాజెక్టుకు ప్రణాళికను రూపొందిస్తున్నాం అని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఐదేళ్లలో 11 వేల పరిశ్రమలు
టీఎస్ఐపాస్తో తెలంగాణలో పారిశ్రామిక విప్లవం తెచ్చాం. గత ఐదేళ్లలో 11 వేలకుపైగా పరిశ్రమలు తెచ్చాం. భారతదేశంలోనే అత్యంత భారీ ప్రాజెక్టుగా ఫార్మాసిటీని రూపొందిస్తాం. ఇక్కడి లక్షల ఉద్యోగాలు యువకులకు అందించబోతున్నాం. కేవలం ఫార్మా రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా భారీ రేంజ్లో ప్రాజెక్టులకు అంకురార్పణ చేస్తున్నాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
రాజకీయ నేతల ఆందోళనలతో
రాజధాని పరిసర ప్రాంతమైన ముచ్చెర్లలో ఫార్మాసిటీ కడుతున్నామంటే ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించే ప్రయత్నించారు. దాంతో ప్రజల్లో కొంత ఆందోళన నెలకొన్న విషయం వాస్తవమే. రాంచంద్రాపురం, ఇతర ప్రాంతాల్లో గతంలో ఏర్పాటైన పారిశ్రామిక వాడల వల్ల కలుషిత వాతావరణం నెలకొన్నది. అందుకే రాజకీయ నేతల వ్యాఖ్యల్లో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.