కేటీఆర్ ప్రసంగానికి ఢిల్లీలో పారిశ్రామికవేత్తల ప్రశంసలు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, డిజిటల్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, సిఐఐ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఎకనమిక్ సమ్మిట్లో కెటిఆర్ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కేటీఆర్
గురువారం తాజ్ ప్యాలెస్ హోటల్లో ప్రారంభమైన ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి అనేకమంది పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. పెట్టుబడులు, డిజిటల్ పరిజ్ఞానం అంశాలపై వేర్వేరుగా జరిగిన చర్చల్లో మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగానికి పారిశ్రామికవేత్తల ప్రశంసలు లభించాయి. పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులతో కూడిన ఈ రెండు ప్యానెళ్లలో కేటీఆర్ మాత్రమే ఏకైన రాజకీయ ప్రతినిధి.
ఇండియన్ ఎకనామిక్ ఫోరమ్
మౌలిక వసతుల రంగంలోనూ, అలాగే తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కెటిఆర్ ఈ సందర్భంగా వివరించారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారానే దేశం, రాష్ట్రాలు ముందుకు వెళ్తాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలకు మూలధనం కొరత ఉన్నందున ప్రైవేటు పెట్టుబడులతోమౌలిక వసతుల రంగాన్ని అభివృద్ధిలో ముందుగు తీసుకెళ్లావచ్చని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో..
ఇందుకోసం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను కెటీఆర్ వివరించారు. తెలంగాణ అభివృద్ధికి తీసుకొంటున్న చర్యలు, ముఖ్యంగా జాతీయ రహాదారులు, విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన విప్లవత్మక మార్పుల గురించి వివరించారు. నాణ్యమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తే ప్రజలకు ఉత్తమ సేవలు లభిస్తాయని, వీటిని అందుకునేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు.
ఫీజు వసూళ్లు
ప్రధానంగా జాతీయ రాహదారుల్లో టోల్ప్లాజాల వద్ద రుసుము వసూళ్లు, అలాగే విమానశ్రాయాల అభివృద్ధికి సంబంధించిన ఫీజు వసుళ్ల వంటివి విజయవంతమయ్యాయని కేటీఆర్ చెప్పారు. అనంతరం మధ్యాహ్నం జరిగిన రెండవ ప్యానెల్ చర్చలో డిజిటలైజింగ్ ఇండియా అనే అంశంపై కెటిఆర్ ప్రసంగించారు.
దేశానికి ఆదర్శం
సమీప భవిష్యత్తులో తెలంగాణ డిజిటల్ డివైడ్ అనే అంశంలో దేశానికే ఆదర్శంగా ఉండబోతోందన్నారు. డిజిటల్ లిటరసీ మిషన్లో భాగంగా తెలంగాణలో ఇప్పటికే రెండులక్షల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దామదన్నారు. ప్రతి ఇంటిలో ఒకరిని డిజిటల్ అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యమన్నారు.