కేటీఆర్ వైఖరి ముమ్మాటికి తప్పు..! తెలంగాణ వాదులు టీఆర్ఎస్ లో ఎందుకుండాలన్న విజయ శాంతి..!!
హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పై కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి మండిపడ్డారు. భారతీయ జనతాపార్టీ వైఖరిని విమర్శిస్తున్న గులాబీ పార్టీ నేత కేటీఆర్ నిన్నటి వరకు అదే విధానాన్ని అవలంభించారని ఎద్దేవా చేసారు. తమ పార్టీలో చేరకపోతే బీజేపి రాజకీయ నేతలను తప్పుబడుతోందన్న కేటీఆర్ టీఆర్ఎస్ లో చేరని వాళ్లను గతంలో తెలంగాణ ద్రోహులతో పోల్చలేదా అని ఆమె నిలదీసారు.
ఇప్పుడు దేశంలో రెండోసారి అదికారంలోకి వచ్చిన బీజేపి విధానాలను విమర్శిస్తున్న టీఆఎస్ గతంలో ఎందుకు స్పందించలేదని రాములమ్మ సూటిగా ప్రశ్నించారు. తన చాపకిందకు నీరు రానంతవరకూ ఎలాంటి సమస్య లేదు, తన చాపకిందకు నీరొచ్చే వరకు రాజకీయాల్లో నైతిక విలువలు గుర్తొచ్చాయా అంటూ కేటీఆర్ పై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసారు.తమతో ఉంటే దేశ భక్తుడివి, లేకపోతే దేశ ద్రోహివి అన్న పరిస్థితులు ప్రస్తుతం దేశంలో దాపురించాయంటూ ఇటివలే బీజేపీపై కేటీఆర్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
కాగా అచ్చం ఇలాంటి వ్యాఖ్యలే ...టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి చేశారు. తన వరకు వస్తే కానీ అసలు తత్వం బోధపడదన్న చందంగా కేటీఆర్ నిర్వేదం ఉందని ఆమె విమర్శించారు. తమతో కలవని వాళ్లను దేశద్రోహులుగా ముద్రవేస్తూ బీజేపీ రాజకీయం చేస్తోందన్న కేటీఆర్ కామెంట్లకు ఆమె కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్ళ కాలంలో టీఆర్ఎస్ అధిష్టాన వైఖరిని చూస్తూ ఉంటే, మతో కలిసి ఉన్న వారే తెలంగాణ వాదులు, లేకపోతే తెలంగాణ ద్రోహులు అనే విధంగా నియంతృత్వ ధోరణి కనిపించిందని ఆమె విమర్శించారు.
ఈరోజు కేటీఆర్ అభిప్రాయం ఎలా ఉందో సరిగ్గా అదే అభిప్రాయంతోనే ఇంతకాలం ప్రతిపక్షాలన్నీ అంతర్మథనంతోను, ఆవేదనతోను కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఇప్పటికైనా అసలు తత్వం టిఆర్ఎస్ అధిష్టానానికి బోధ పడినందుకు సంతోషమని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. రాబోయే రోజుల్లోనైనా టిఆర్ఎస్ అగ్రనాయకత్వం తన వైఖరిని మార్చుకోవాలని ప్రతిపక్షాలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు.