రెచ్చగొట్టినా విన్నాం.. చూడండి, కెసిఆర్ తల్చుకుంటే నగ్నంగా..!: కెటిఆర్
హైదరాబాద్: శాసన సభలో చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు కవ్వించే, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా.. వారి అభిప్రాయాలను తాము ఓపిగ్గా విన్నామని, సభలో మాకంటే వారే ఎక్కువ సమయం మాట్లాడారని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం అన్నారు.
విపక్షాలు ఆరు గంటల 23 నిమిషాలు మాట్లాడితే, అధికార పార్టీ మాత్రం కేవలం గంటా యాభై నిమిషాలు మాత్రమే మాట్లాడిందన్నారు. మా కంటే వారు దాదాపు మూడు రెట్లు ఎక్కువగా మాట్లాడారన్నారు. వారు కవ్వించే ప్రయత్నం చేసినా ముఖ్యమంత్రి కెసిఆర్ మా సభ్యులను అదుపు చేశారన్నారు.
రైతుల సమస్యల పైన సభలో పన్నెండు గంటలపాటు చర్చ జరిగిందన్నారు. రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో చేస్తోందన్నారు. అయినప్పటికీ విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. రైతులకు మద్దతు ధర, విత్తనాల పంపిణీ సక్రమంగా జరుగుతున్నా రైతుల ఆత్మహత్యలు బాధాకరమన్నారు.
పదిహేను రోజుల్లో ఏం చేశామో, మున్ముందు ఏం చేస్తామో ముఖ్యమంత్రి కెసిఆర్ సభలో స్పష్టంగా చెప్పారన్నారు. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. రాబోయే మార్చి నుంచి పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామని చెప్పామన్నారు.
విత్తన భాండాగారంగా తెలంగాణను ఎలా చేస్తామో చెప్పామన్నారు. విపక్షాలు ఆరు గంటలు మాట్లాడినప్పటికీ.. ఎలాంటి సూచనలు సరిగా లేవన్నారు. వారు చర్చ కాకుండా.. రచ్చ కావాలనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నారన్నారు. వారు శవాల పైన పేలాలు ఏరుకునే విధంగా ప్రవర్తించారన్నారు.
రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తే.. దానిపై ఆలోచన చేస్తామని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ విపక్షాలు రాద్దాంతం చేశాయన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడిన ప్రతి మాటను ఓపిగ్గా విన్నామని కెటిఆర్ చెప్పారు.
కెసిఆర్ తల్చుకుంటే..
ముఖ్యమంత్రి కెసిఆర్ తల్చుకుంటే ప్రతిపక్షాలను చీల్చి చెండాడవచ్చున్నారు. అరవై సంవత్సరాల చరిత్రను నగ్నంగా నిలబెట్టవచ్చున్నారు. కానీ తాము అలా ఆలోచించలేదన్నారు. కానీ విపక్షాలు మాత్రం రచ్చ చేసేందుకు ప్రయత్నించాయన్నారు.
తొలుత, ప్రతిపక్షాలు రైతులకు ఏం చేశాయో చెప్పాలన్నారు. కెసిఆర్ మీద రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉండి అధికారం అప్పగించారన్నారు. వారు అరవై సంవత్సరాల్లో చేసిన పనిని మా ప్రభుత్వం పదిహేను నెలల్లోనే చేయాలనే అసహనం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.
మీ బాగోతం సభా వేదికగా ప్రజల ముందు బయటపడిందన్నారు. సభకు వెళ్లి అధికార పార్టీని చీల్చి చెండాడుతామని బయట చెప్పిన విపక్షాలు, సభలో డొల్ల వాదన చేశాయన్నారు. ప్రభుత్వానికి రైతుల్లో వస్తున్న ఆదరణ చూడలేకే ఇలా చేస్తున్నారన్నారు.
వారసత్వంగా వచ్చిన విద్యుత్ కోతలతో తెలంగాణ సతమతమైందని, దానిని అధిగమించామన్నారు. మేం 15 నెలల్లో చేసిన అభివృద్ధిని వివరించామని చెప్పారు. ఆరు నెలల కాలంలో ఎవరూ ఊహించని విధంగా విద్యుత్ సమస్యను అధిగమించామన్నారు.