పస లేని పార్టీలు ఆన్లైన్లోవాగుతున్నాయి...సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకోండి: కేటీఆర్
హైదరాబాదు: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇందులో భాగంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకోండి: కేటీఆర్
మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకోవాలని ఇందుకోసం ఎప్పుడూ యాక్టివ్గా ఉండేవారు ఈ బాధ్యతలను చేపట్టాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని కోరారు. కొన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా కొన్ని అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు కేటీఆర్. ఆన్లైన్ ప్రచారం ఒక అస్త్రంగా మలుచుకుని రానున్న మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
సమాజాన్ని రెండుగా చీల్చే ప్రయత్నం
కొన్ని పార్టీలు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై అబాంఢాలు వేస్తున్నాయని వాటన్నిటినీ తిప్పికొట్టాలని అదే సమయంలో తప్పుడు ప్రచారాలకు పోకుండా జాగ్రత్తగా ఆన్లైన్ క్యాంపెయిన్ చేయాలని సూచించారు. కొన్ని రాజకీయ పార్టీలు సమాజాన్ని రెండుగా చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. వారి భావజాలంతో ఏకీభవించకపోతే వారిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కానీ టీఆర్ఎస్ కేవలం నిజాలపైనే ఆధారపడుతుందని, స్పష్టమైన సమాచారంనే ప్రజలకు చేరవేస్తుందని క్రమశిక్షణతో కూడిన వారు తమ కార్యకర్తలని కేటీఆర్ చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీలకు అడ్రస్ ఉండదు
ప్రజల్లో పెద్దగా పట్టులేని పార్టీలు కూడా టీఆర్ఎస్ను విమర్శిస్తున్నాయని ఆన్లైన్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే ప్రజల్లో తిరస్కరణకు గురైన ఆ పార్టీలు రానున్న స్థానిక ఎన్నికల్లో కనుమరుగవుతాయని జోస్యం చెప్పారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా పార్టీ నేతలైన క్రిషాంక్, జగన్, దినేష్ సతీష్లను నియమించారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తున్న పార్టీలకు సరైన పద్ధతిలో కౌంటర్ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సంప్రదాయ మీడియాకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా ఎదిగిందని దీన్నే అస్త్రంగా మలుచుకుని ప్రజలకు చేరువకావాలని చెప్పారు మంత్రి కేటీఆర్.
టీఆర్ఎస్కు ఫేస్బుక్పై 11 లక్షల మంది ఫాలోవర్లు
టీఆర్ఎస్కు ఫేస్బుక్ పేజ్పై 11 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. మరే ఇతర పార్టీలకు తమ ఫేస్బుక్ పేజ్లపై ఈ స్థాయిలో ఫాలోయింగ్ లేదని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపైనే ప్రజలు తమ పార్టీకి ఓట్లు వేస్తారని చెప్పారు. ప్రభుత్వ పనితీరు సరిగ్గా లేదని భావిస్తే ప్రజలు తమ పార్టీని ఆదరించేవారు కాదని చెప్పారు. సోషల్ మీడియాలో తమ పార్టీ కార్యకర్తలను అదే పనిగా ఎవరైనా లక్ష్యంగా చేసుకుంటే ఆ కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని అవతల వ్యక్తుల భరతం పడుతామని హెచ్చరించారు మంత్రి కేటీఆర్.