ముఖ్యమంత్రి అవుతారా?: కేటీఆర్ ఏం చెప్పారంటే..?, ‘కాంగ్రెస్, బీజేపీ కలిసి డ్రామాలు’
Recommended Video
హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సందర్భంగా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియాతో పలు కీలక అంశాలపై స్పందించారు. మున్సిపల్ ఎన్నికలు తనకు సవాలేనని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే లేరు..
కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని మంత్రి చెప్పారు. 25 పట్టణాల్లో కాంగ్రెస్, బీజేపీ పూర్తి స్థాయిలో అభ్యర్థుల్ని నిలబెట్టలేదు. రాష్ట్రంలో నిరంతర వెలుగులు తీసుకొచ్చింది తమ ప్రభుత్వమేనని అన్నారు. రాష్ట్రంలో మినీ ట్యాంక్ బండ్లు 90 నిర్మించామని, హైదరాబాద్ చుట్టూ 25 పార్కులు ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ముఖ్యమంత్రి పదవిపై...
తాను ముఖ్యమంత్రి అవుతారంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ అంశంపై మీడియావారే మంత్రులతో మాట్లాడిస్తున్నారని అన్నారు. ఇటీవల పలువురు మంత్రులు కేటీఆరే త్వరలో సీఎం అవుతారన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు.
కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తూ డ్రామాలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ మనసులో ఇంకా చాలా సంక్షేమ పథకాలున్నాయని, వాటన్నిటినీ క్రమ క్రమంగా అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ సర్కారు హయాంలో పట్టణాల అభివృద్ధి జరుగుతోందని అన్నారు. రూ. 8వేల కోట్లతో 2లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. టీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తూ పైకి డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు.
లక్ష్మణ్ అదనపు నిధులేవీ?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఐదేళ్లలో కేంద్రం నుంచి అదనపు నిధులు ఏమైనా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగులకు ప్రభుత్వంపై విశ్వాసం ఉందన్నారు. కాగా, జనవరి 22న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జనవరి 25న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలవడనున్నాయి. టీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, బీజేపీలు కూడా ఈ మున్సిపల్ ఎన్నికలు సత్తా చూటాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ మాత్రం క్లీన్ స్వీప్ చేయాలని ఇప్పటికే కసరత్తులను ముమ్మరం చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు అధికార పార్టీకి ప్రతిష్టాత్మకం కానున్నాయి.