కాంగ్రెస్ని పాక్ క్రికెట్ టీంతో పోల్చిన కేటీఆర్, జానా ఫైర్
హైదరాబాద్: తెలంగాణ శాసన సభలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీల మధ్య మంగళవారం వాగ్వాదం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ పాక్ క్రికెట్ టీంలా ఉందని తెరాస ఎద్దేవా చేసింది. ఓ సందర్భంలో.. సభలో నిబంధనలు పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు.
దీనిపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభాపతి పైన కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. సభాపతి పైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నియమ, నిబంధనలు పాటించడం లేదని సభాపతిని అనవద్దన్నారు.
స్పీకర్ పైన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరు పాకిస్తాన్ క్రికెట్ జట్టులా ఉందని ఎద్దేవా చేశారు. ఒక కెప్టెన్, 10 మంది మాజీ కెప్టెన్లలా టీ కాంగ్రెస్ తీరు ఉందని విమర్శించారు.
దీనిపై జానా రెడ్డి ఘాటుగా స్పందించారు. నియమ నిబంధనల పైన అధికార తెరాస ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. భట్టి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేద్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవన్నారు. భట్టి మాట్లాడితే పదిమంది మంత్రులు అడ్డు తగలడం ఎంత వరకు సమంజసమన్నారు.
ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని మంత్రి ఈటెల రాజేందర్ అంతకుముందు అన్నారు. ఉద్యోగాల భర్తీ, ప్రమోషన్లకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామంటే ఉస్మానియా వర్సిటీలో దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలంటూ అసెంబ్లీలో విపక్షాలు ఆందోళన చేస్తున్నారన్నారు. నిరుద్యోగుల సమస్యకు కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు.
ప్రభుత్వం టీడీపీ గొంతు నొక్కుతోంది: సండ్ర
సభలో ప్రభుత్వం టీడీపీ గొంతు నొక్కుతోందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సభలో లేనివాళ్లను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల హక్కులను హరీష్ రావు బంధువుకు ఏ ప్రాతిపదికన ఇచ్చారని ప్రశ్నించారు. లైవ్ టెలీకాస్ట్ ఆర్డర్ కాపీని ఇవ్వాలని కోరితే స్పీకర్ ఎందుకు స్పందించడం లేదన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్నారు.