చిల్లర ప్రచారం మానుకోండి .. కర్ణాటకలోలా డ్రామాలు తెలంగాణలో నడవవు .. బీజేపీపై కేటీఆర్ ఫైర్
తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పై మహా సమ్మేళనం భారీ బహిరంగ సభలో బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పవిత్ర్ నామ్ గందా కామ్ అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందని ఆయన విరుచుకుపడ్డారు. గరికపాటి తో సహా పలువురు టీడీపీ నేతలు బిజెపిలో చేరిన ఈ కార్యక్రమంలో జేపీ నడ్డా తెలంగాణ రాష్ట్రంలోని కెసిఆర్ పాలన పై నిప్పులు చెరిగారు. ఇక నడ్డా వ్యాఖ్యలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఆ చట్టాలపై కలెక్టర్లతో సీఎం కేసీఆర్ చర్చ .. అధికారుల బదిలీలు అందుకే .. 20 న కీలక సమావేశం
అవినీతిపై ఆధారాలు ఉంటే నిరూపించాలని నడ్డా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
సోమవారం నాడు కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలు హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో బిజెపి పై నిప్పులు చెరిగిన కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో చేసినట్టుగా డ్రామాలు చేయడం తెలంగాణలో సాధ్యం కాదని బీజేపీ నేతలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనిఆరోపణలు చేయడం కాదు ఒకవేళ అవినీతిపై ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ వేదికగా బీజేపీ నేతలు చెప్పినవన్నీ అబద్ధాలేనని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన మీరా మాట్లాడేది అంటూ ఫైర్
కర్ణాటక రాష్ట్రంలో చేసినట్టుగా డ్రామాలు చేయడం తెలంగాణలో సాధ్యం కాదన్న కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నాయకులు డిపాజిట్లు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేసుకొని మాట్లాడాలని హెచ్చరించారు. 119 స్థానాల్లో పోటీ చేస్తే బిజెపి ఎన్ని స్థానాల్లో గెలిచిందో చెప్పాలంటూ ప్రశ్నించారు కేటీఆర్. జాతీయ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేసినా కూడా తెలంగాణ ప్రజలు బిజెపి ని ఆదరించింది లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలంటూ కేటీఆర్ నిలదీశారు .
మా పథకాలను కాపీ కొట్టి మీ పథకాలుగా ప్రకటించుకుంటున్నారని ఎద్దేవా చేసిన కేటీఆర్
బిజెపి నేతలు చిల్లర ప్రచారాన్ని మానకుంటే ప్రజాక్షేత్రంలో చావు దెబ్బ తప్పదని ఆయన అన్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కాపీ కొట్టి వాటిని తమ పథకాలు గా ప్రకటించుకుంటుందని ఎద్దేవా చేశారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు వచ్చిన జేపీ నడ్డా వచ్చిన పని చూసుకొని పోక తమ పార్టీ పైన అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని తేల్చిచెప్పారు. బిజెపి నేతల తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు కేటీఆర్. తెలంగాణా రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం కాంగ్రెస్, బీజేపీలకు ఇష్టం లేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఇటీవల కాలంలో బిజెపి పైన కేటీఆర్ విమర్శలు వర్షాన్ని కురిపించడమే కాకుండా తీవ్ర వ్యాఖ్యలతో వార్నింగ్ ఇస్తున్నారు.