షాకింగ్: 'జూ.ఎన్టీఆర్ రాకుండా చంద్రబాబు కుట్ర! అందుకే లోకేష్ బదులు సుహాసిని'
హైదరాబాద్: మహాకూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి రాజకీయాలు తెలియవని తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆయన కూకట్పల్లిలోని కేపీహెచ్బీ బాలానగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
నందమూరి కుటుంబంపై చంద్రబాబుకు అంతగా ప్రేమ ఉంటే ఆమెకు ఏపీలో మంత్రి పదవి ఇవ్వవచ్చునని చెప్పారు. ఇటీవల లోకేష్కు, గతంలో నందమూరి హరికృష్ణకు నేరుగా కేబినెట్లో చోటు కల్పించారని గుర్తు చేశారు. తెలంగాణలో మహాకూటమి గెలిస్తే దేనికైనా అమరావతి వెళ్లవలసి వస్తుందని హెచ్చరించారు.
నందమూరి సుహాసినికి వైసీపీ భారీ దెబ్బ?: ఓడితే ఏపీ సీఎంగా.. ఇదీ జగన్ లెక్క!
చంద్రబాబుకు ఇన్నాళ్లు తెలంగాణ గుర్తుకు రాలేదా?
ఇన్నాళ్లు చంద్రబాబుకు తెలంగాణ గుర్తుకు రాలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఆయనకు మన రాష్ట్రం గుర్తుకు వస్తోందని చెప్పారు. 2014లో తమ పార్టీ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొనేందుకు ఆనాడు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఈనాడు కేసీఆర్ను ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయని చెప్పారు.
సుహాసినిని గెలిపిస్తే.. కేటీఆర్ హెచ్చరిక
కూకట్పల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థు నందమూరి సుహాసినిని గెలిపిస్తే అభివృద్ధిలో వెనుకబడుతుందని కేటీఆర్ హెచ్చరించారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వ్ స్థానంలో ఉందని చెప్పారు. రైతు బంధు పథకంతో కేసీఆర్ రైతులకు భరోకా సల్పించారని చెప్పారు. నాలుగున్నరేళ్ల అభివృద్ధి మీ కళ్ల ముందు ఉందని చెప్పారు.
లోకేష్ను సరే, సుహాసినిని మంత్రిగా ఎందుకు చేయలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ శాసన సభ్యుడిగా గెలవకుండానే మంత్రి అయ్యారని కేటీఆర్ గుర్తు చేశారు. చంద్రబాబు తన కొడుకును మంత్రిగా చేశారని, అలాగే నందమూరి కుటుంబం పైన అంతగా ప్రేమ, అభిమానం ఉంటే ఇక్కడి అభ్యర్థి సుహాసినిని కూడా ఏపీలో ఎందుకు మంత్రిగా చేయలేదో చెప్పాలని నిలదీశారు.
కూటమి గెలిస్తే అమరావతికి పోవాల్సిందేనని హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రం వస్తే సీమాంధ్రులపై దాడులు చేస్తారని అప్పుడు ప్రచారం జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఈ నాలుగున్నరేళ్ళ కేసీఆర్ పాలనలో ఒక్క సీమాంధ్ర వ్యక్తి అయినా హైదరాబాదులో ఇబ్బందులు పడ్డారా చెప్పాలని ప్రశ్నించారు. పొరపాటున మహాకూటమి గెలిస్తే ప్రతి పనికి మనం అమరావతికి పోవాల్సిందేనని హెచ్చరించారు.
కాంగ్రెస్, టీడీపీ కలవడం పాము, ముంగీస కలవడమే
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలవడం చాలా ఆసక్తికరమని కేటీఆర్ చెప్పారు. ఇలా కలిసినందుకు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంటుందన్నారు. పాము, ముంగీస ఎక్కడైనా కలుస్తాయా అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తీసుకెళ్లి రాహుల్ గాంధీలో పెట్టారని ఆరోపించారు. వారు ఒకరి చేతిలో ఒకరు వీణ, పిడేల్ పెట్టుకున్నారని రాహుల్, చంద్రబాబులను ఉద్దేశించి అన్నారు. డిసెంబర్ 7న ఎన్నికలు ముగిసి, 11న ఫలితాలు వచ్చాక మన పార్టీ అధినేత కేసీఆర్.. 'కేసీఆర్ అను నేను' సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే చంద్రబాబు, రాహుల్ గాంధీలు పిడేల్, వీణలు వాయిస్తారని చెప్పారు. జోగి జోగి రాసుకుంటే బూడిద వస్తుందన్నారు. ఒకరి భుజంపై మరొకరు చేయి వేసుకుంటున్నారని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి అన్నారు. ఒక్కో నాయకుడు నాలుగైదు జెండాలు మెడలో వేసుకుంటే జనాలు సంక్రాంతి అప్పుడే వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నారని చెప్పారు.
సుహాసిని ఓడిపోతుందని చంద్రబాబు బలిపశువును చేసారు
ఈ సందర్భంగా కేటీఆర్ ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. కూకట్పల్లి ఓడిపోయే సీటు అని తెలిసే చంద్రబాబు ఆమెను బలిపశువుగా చేశారని చెప్పారు. సుహాసిని ద్వారా ఆమె సోదరులను (జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్) రేపు రాజకీయాల్లోకి రాకుండా చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో టీడీపీ పాగా వేయాలంటే నారా లోకేశ్ను రంగంలోకి దించవచ్చు కదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ మనవరాలిపై అంతగా ప్రేమ ఉంటే ఏపీలోనే మంత్రిగా చేయవచ్చునని చెప్పారు.
సింహం సింగిల్గానే వస్తుంది
ఇటీవల ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి రాహుల్ చేతిలో వీణ పెట్టారని, ఆయన ఈయన చేతిలో ఫిడేలు పెట్టారని చెప్పారు. డిసెంబర్ 11 ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసేటప్పుడు ఆయన వీణ, ఈయన ఫిడేలు వాయించకోవడం తప్ప ఏమీ కాదని కేటీఆర్ అన్నారు. గతంలో మేం తెలంగాణ సాధన ప్రాతిపదికన పొత్తులు పెట్టుకున్నామని, ఈ రోజు టీడీపీ కాంగ్రెస్తో ఎందుకు పొత్తు పెట్టుకుందని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన పెట్టుకున్నారో చెప్పాలన్నారు. సింహం సింగిల్గానే వస్తుందని చెప్పారు.
సీమాంధ్ర సోదరులారా ఆలోచించండి
ఏం తప్పు చేశానని కేసీఆర్ తనను విమర్శిస్తున్నారని చంద్రబాబు అంటున్నారని, కానీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చంద్రబాబు చేయలేదా అని ప్రశ్నించారు. రూ. 50లక్షలతో అప్పట్లో మీ పార్టీ ఆయన దొరికిపోలేదా అన్నారు. చంద్రబాబు ఫోన్లో మాట్లాడలేదా అని ఓటుకు నోటు కేసును లాగారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 30 ఉత్తరాలు రాయలేదా అన్నారు. చంద్రబాబును విమర్శించడంలో సహేతుక కారణం ఉన్నదని చెప్పారు. తెరాస సర్కార్ను అస్థిరపరిచే ప్రయత్నం చేశారన్నారు. ప్రాజెక్టులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు గనకే విమర్శలు చేస్తున్నామని, అంతేగానీ తమకేమీ ఆయనతో వ్యక్తిగత గొడవలు లేవని చెప్పారు. సీమాంధ్ర సోదరులను నాలుగున్నరుళ్ల కంటికి రెప్పలా కాపాడుకున్న తెరాసకు ఒక్క చంద్రబాబుతోనే గొడవ ఎందుకు ఉందో ప్రజలు ఆలోచించండని చెప్పారు. రేపటి రోజున ఆయన అభ్యర్థి ఇక్కడ గెలిచినా, గెలవకపోయినా చంద్రబాబుకు ఏమీకాదని, నష్టపోయేది మాత్రం ప్రజలు అని చెప్పారు.