ఇవాంక పర్యటన, మెట్రో రైలు: కెటిఆర్పై కెసిఆర్ తేల్చేశారు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వారసుడు ఆయన తనయుడు, ఐటి మంత్రి కెటి రామారావేనని తేలిపోయింది. ఈ విషయాన్ని కెసిఆర్ చెప్పకనే చెప్పేశారు. హైదరాబాద్లో జరిగిన రెండు ప్రధాన కార్యక్రమాల్లోనూ కెటిఆరే ప్రముఖంగా కనిపించారు.
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులోనూ హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ కెసిఆర్ కన్నా కూడా కెటిఆరే ప్రధానంగా కనిపించారు. దీన్ని బట్టి కెసిఆర్ తర్వాతి స్థానం కెటిఆర్దేనని తేలిపోయింది.
మెట్రో రైలు ప్రయాణంలో...
హైదరాబాద్ మెట్రో రైలును ఈ నెల 28వ తేదీన ప్రధాని మోడీ ప్రారంభించారు. ఆ తర్వాత కెసిఆర్, గవర్నర్ నరసింహన్, కెటిఆర్లతో కలిసి రైలులో ప్రయాణం చేశారు. మోడీకి ఓ వైపు గవర్నర్ కూర్చోగా, ఆయన తర్వాత కెసిఆర్ కూర్చున్నారు. మరోవైపు కెటిఆర్ కూర్చున్నారు. ప్రధానితో ముచ్చట్లు పెడుతూ కెటిఆర్ అందరినీ ఆకర్షించారు. ఒక రకంగా కెసిఆర్ తన స్థానాన్ని కెటిఆర్కు ఇచ్చారని భావించాల్సి ఉంటుందని అంటున్నారు.
జిఈఎస్లో ఇవాంకతో కెటిఆర్
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు తొలి రోజు ప్రారంభ కార్యక్రమం ముగిసిన తర్వాత కెటిఆర్ అంతా తానై నడిపించారు. రెండో రోజు ఇవాంకతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆంగ్ల భాషా ప్రావీణ్యం, బోధనానుభవనం ఆయనకు బాగా కలిసి వచ్చింది. కెటిఆర్ను ఇవాంక అమెరికాకు కూడా ఆహ్వానించారు. అనుకున్నట్లే ఆయనకు అమెరికా శ్వేతసౌధం నుంచి ఆహ్వానం కూడా వచ్చింది.
సందడి లేని కల్వకుంట్ల కవిత..
కెసిఆర్ కూతురు కల్వకుంట్లకవిత సందడి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో కనిపించలేదు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ సదస్సులో ఆమె కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దానికి కారణం ఏమిటో తెలియదు. కానీ ఆమె ప్రపంచ తెలుగు మహాసభ ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలపై కెసిఆర్ ఇటీవల ఏర్పాటు చేసిన రచయితల సమావేశంలో ఆమె ప్రముఖంగా కనిపించారు.
ఢిల్లీలో హరీష్ రావు...
హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభం, జిఈఎస్ ఉండగా కెసిఆర్ మేనల్లుడు, మంత్రి హరీష్ రావు ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ముఖ్యమైన పని మీదనే ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద తన తర్వాత స్థానం కెటిఆర్దేనని కెసిఆర్ తేల్చేశారని అంటున్నారు.