కాంగ్రెసోళ్లకు పనిలేదు, అతను వీఆర్ఏ కాకున్నా..: కేటీఆర్ ఆగ్రహం, టీఆర్ఎస్లోకి టీడీపీ నేతలు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలపై తెలంగాణ మంత్రి కేటీ రామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు. గడ్డాలు పెంచుకుంటే సన్యాసులవుతారు కానీ, అధికారంలోకి రారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ టీడీపీ నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, పోచారం సమక్షంలో వీరంతా గులాబీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. బాన్సువాడ నియోజకవర్గ టీడీపీ నేత బజ్యానాయక్, గాంధారి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ తాన్సింగ్తో పాటు పలువురు కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు గులాబీవనంలో చేరారు.
ఈ సందర్భంగా బజ్యానాయక్ మాట్లాడుతూ.. ఇంటిపార్టీ టీఆర్ఎస్ చేరడం సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే సేవాలాల్ మహరాజ్ జయంతి నిర్వహిస్తున్నరని చెప్పారు. సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ ఆరోపణలో వాస్తవం లేదు
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తమది ప్రజల సమస్యల పట్ల సోయి ఉన్న ప్రభుత్వమని అన్నారు. సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి ఇద్దరూ రైతులేనని అన్నారు. కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా వీఆర్ఏను చంపేసిందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
కాంగ్రెసోళ్లకు పనిలేదు..
తాను కామారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి కనుక్కున్నానని, చనిపోయింది వీఆర్ఏ కాదని అధికారికంగా చెబుతున్నానని కేటీఆర్ అన్నారు. కాంగ్రెసోళ్లకు పనిలేక ఇలాంటి అవాస్తమైన ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా గవర్నర్ దగ్గరకు పోయి తప్పుడు ఫిర్యాదు చేశారని దుయ్యబట్టారు.
ఇసుక మాఫియా హత్యగా..
ఇటుక ట్రాక్టర్ కింద పడి సాయిలు అనే కార్మికుడు మరణించాడని, దీన్ని ఇసుక మాఫియా హత్యగా చిత్రీకరించారని అన్నారు. మీడియా కూడా అసలు వాస్తవమేంటో తెలుసుకుని వార్తలను ప్రచురితం చేయాలని, ప్రజలు గమనిస్తుంటారని అన్నారు. ఇప్పటికైనా ఆ వార్తను సవరించి ప్రచురితం చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు.
సంచలనాల కోసం వార్తలు రాయడం మీడియాకు మంచిది కాదని అన్నారు.
ఇటుక ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే..
కాగా, కామారెడ్డి జిల్లా పిట్లం ఘటనలో మృతిచెందిన వ్యక్తి వీఆర్ఏ కాదని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న వీఆర్ఏ సాయిలును హత్యచేశారని శుక్రవారం వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. మృతిచెందిన వ్యక్తి సాయిలు వీఆర్ఏ కాదన్నారు. సంఘటన జరిగిన కాకివాగులో అసలు ఇసుక లభ్యత లేదన్నారు. సాయిలు మృతికి ఇసుక రవాణాకు సంబంధం లేదని వెల్లడించారు. కుమార్తె ఇంటికి వెళ్తుండగా సాయిలు ప్రమాదానికి గురై మృతిచెందాడని కలెక్టర్ పేర్కొన్నారు. ఇదే అంశంపై జిల్లా ఎస్పీ శ్వేత మాట్లాడుతూ.. సాయిలును ఢీకొట్టింది ఇసుక ట్రాక్టర్ కాదని.. ఇటుకలతో వెళ్తున్న ట్రాక్టర్ అని తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.