మీరు ఉద్ధరిస్తే! ఇంకా ప్రజలకెందుకీ కష్టాలు: కేటీఆర్ సెటైర్
భద్రాద్రి: తెలంగాణ మంత్రి కేటీ రామారావు ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు గతంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఉద్ధరిస్తే ప్రస్తుతం ప్రజలు ఎందుకు కష్టాలు ఎదుర్కొంటున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, కొత్తగూడెం పురపాలక సంఘం పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం పక్కా కార్యాచరణతో ముందుకెళుతోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో తమ పునాదులు కదులుతాయన్న భయంతోనే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్ హయాంలో 29 లక్షల మందికి పింఛన్లు ఇస్తే.. తాము 38 లక్షల మందికి అందిస్తున్నామని చెప్పారు. పింఛన్ల కోసమే రూ.4,500 కోట్లు వెచ్చిస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమని నమ్మి ప్రజలు అధికారంలోకి తీసుకొస్తే ప్రతిపక్షాలకు మింగుడు పడడంలేదని మంత్రి విమర్శించారు. అందుకే గ్రామాలపై పడుతున్నారని, అక్కడి ప్రజలు వారిని వింతగా చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
సకల జనుల సమ్మె కాలంలో సింగరేణి కార్మికుల సహకారం మరవలేనిదని, వారికి రుణపడి ఉంటామని చెప్పారు. యువత కోసం కొత్తగూడెంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, టిఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇస్తుందని రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి ఎనలేనిదని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలల ఫీజులను దృష్టిలో పెట్టుకొని పాతకొత్తగూడెంలో ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కొత్తగూడెం విమానాశ్రయ నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్కి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.