ముగ్గుల్లో కారు, పతంగిలో కేసీఆర్, వినూత్నంగా మున్సిపోల్స్ ప్రచారం: కేటీఆర్
మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మనం చెప్పింది చెప్పినట్టు చూపించేది సోషల్ మీడియా అని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యతిరేక వార్తలు రాసినా.. సోషల్ మీడియా మాత్రం వాస్తవాన్ని ప్రతిబింబించిందన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం చేయాలని శ్రేణులకు మార్గదిర్గేనం చేశారు. 200 మంది మీడియా కార్యకర్తలు సహా మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
11 లక్షల మంది
సోషల్ మీడియా పదునైన అస్త్రమని కేటీఆర్ అభివర్ణించారు. టీఆర్ఎస్ అంటే తిరుగలేని రాజకీయ శక్తి అని.. పార్టీకి సోషల్ మీడియా బలం అన్నారు. ప్రజల్లో ఆదరణ ఉండే పార్టీకి సోషల్ మీడియా అదనపు బలం అని.. టీఆర్ఎస్ పార్టీకి 11 లక్షల మంది ఫాలొవర్స్ ఉన్నారని చెప్పారు. మరే పార్టీ దరదాపుల్లో లేరని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియాలో పెయిడ్ వర్కర్క్ లేరని చెప్పారు. పార్టీ మీద అభిమానంతో చాలా మంది పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో వాస్తవాలు వివరించింది సోషల్ మీడియా కార్యకర్తలేనని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉంటారని.. పబ్లిక్ పల్స్ తెలుసుకోవడానికి సోషల్ మీడియా సాధనమని విశ్వసిస్తారని చెప్పారు.
ఇండిపెండెంట్ కన్నా..
బీజేపీ, కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. బీజేపీని చూసి టీఆర్ఎస్ భయపడుతోందని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. తనకు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ అంటే భయం లేదని స్పష్టంచేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీని పోలిన ఇండిపెండెంట్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు రాలేదని.. కానీ ఆ పార్టీ నేత లక్ష్మణ్ మాటలు కోటలు దాటుతాయని మండిపడ్డారు.
700 డివిజన్లలో
3100 మున్సిపల్ డివిజన్లలో ఆరు నుంచి ఏడు వందల డివిజన్లలో బీజేపీకి అభ్యర్థులే లేరని చెప్పారు. దీనిపై ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా గుర్రుగా ఉన్నట్టు తాను విన్నానని చెప్పారు. ఎవరో ఒకరిని పిలిచి టికెట్ ఇవ్వాలని సూచించారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పెన్షన్లలో కేంద్రం వాటా గురంచి బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దానిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.
వినూత్నరీతిలో
మున్సిపల్ ఎన్నికలు సంక్రాంతి పండగ సమయంలో వచ్చినందున వినూత్న రీతిలో ఎన్నికలకు వెళ్లాలని కేటీఆర్ సూచించారు. ఇంటి ముందు వేసే ముగ్గులను కారు గుర్తు, కేసీఆర్ ఫోటో ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే పతంగిలపై కూడా కారు గుర్తు, కేసీఆర్ ఇమేజ్ ఉండేలా ప్లాన్ చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఇలా ముందుకెళితే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం నల్లేరు మీద నడకే అవుతోందన్నారు.