గెడ్డాలు ఒక్కటయ్యాయి: కేటీఆర్, కోదండరాం! ఎమ్మెల్యే కావడానికి ద్రోహుల పక్కన చేరుతావా: హరీష్
జగిత్యాల/నాగర్ కర్నూలు: టీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీ రామారావులు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కేటీఆర్ జగిత్యాలలో, హరీష్ రావు నాగర్ కర్నూలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదనిది, తాము నాలుగేళ్లలో ఎలా చేయగలమని ప్రశ్నించారు.
ఆంధ్రా పాలకుల కంటే కేసీఆర్ దోపిడే ఎక్కువ, సిగ్గులేదా.. మీరు ఎంజాయ్ చేసేందుకా?
మున్సిపల్ మంత్రిగా జగిత్యాలకు జీవన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. డిసెంబర్లో మా ప్రభుత్వం ఏర్పడగానే జగిత్యాలలో రోడ్లను విస్తరిస్తామని చెప్పారు. ప్రత్యర్థులు ఇంకా అభ్యర్థులనే ప్రకటించలేదని చెప్పారు. తాము దాదాపు 90 శాతం అభ్యర్థులను ప్రకటించామని చెప్పారు. పార్టీలో ఆశావహులు ఉన్నారు కానీ, అసంతృప్తులు లేరని చెప్పారు. తాము ఇచ్చిన హామీలన్నీ ఆచితూచి, లెక్కలు తీసి ఇచ్చినవేనని చెప్పారు.
గెడ్డం చంద్రబాబు, గెడ్డం ఉత్తమ్ ఒక్కటయ్యారు
కాంగ్రెస్ పార్టీతో పోల్చితే తాము నాలుగింతలు అభివృద్ధి చేశామని కేటీఆర్ చెప్పారు. కొండగట్టు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. మహాకూటమికి అధికారం అప్పగిస్తే ప్రాజెక్టులు పూర్తి కాకుండా అడ్డుకుంటారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ఓడిపోతామని కోర్టుల చుట్టూ తిరుగుతోందన్నారు. తెలంగాణకు అడ్డం పడిన గడ్డాలు అన్నీ ఒక్కటవుతున్నాయని చంద్రబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ఉద్దేశించి అన్నారు. గెడ్డం చంద్రబాబు, గెడ్డం ఉత్తమ్లు ఒక్కటయ్యారన్నారు.
చంద్రబాబు చేతిలో మహాకూటమి జుత్తు
కేసీఆర్ను ఓడించే వరకూ ఊరుకునేది లేదని టీడీపీ, కాంగ్రెస్ కంకణం కట్టుకున్నాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో నిశ్శబ్ధ విప్లవం ఉందని ఉత్తమ్ అంటున్నారని, డిసెంబర్ 11న ఈవీఎంలు తెరిస్తే బయటకు వస్తుందని చెప్పారు. కేసీఆర్ ఓడిపోతారని ఉత్తమ్ అంటున్నారని, ఫలితాలు వచ్చాక అన్నీ తేలుతాయన్నారు. మహాకూటమి గూబ గుయ్యిమనేలా తీర్పు వస్తుందన్నారు. వంద సీట్లతో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల, సీతారామ ప్రాజెక్టులను ఆపాలని చంద్రబాబు కేంద్రానికి 30 ఉత్తరాలు రాశారని, రేపు ఈ కూటమి అధికారంలోకి వస్తే జుట్టు చంద్రబాబు చేతిలో ఉంటుందని, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాదన్నారు. మహాకూటమికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
కోదండరాం వాళ్ల పక్కన చేరారు
నాగర్ కర్నూలులో హరీష్ రావు మాట్లాడుతూ.. శ్రీశైలం నుంచి ఎక్కువ నీళ్లను తెలంగాణ వాళ్లు తీసుకుపోతున్నారని ఢిల్లీకి చంద్రబాబు ఫిర్యాదు చేశారని, ఈ ప్రాజెక్టు చంద్రబాబు జాగీరా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకు అడ్డుపడుతున్న చంద్రబాబు తెలంగాణకు మేలు చేసే వ్యక్తా అని ప్రశ్నించారు. కేసీఆర్ కన్నా ఆంధ్రావలసవాదులే నయమన్న ఉత్తమ్ పైన నిప్పులు చెరిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల పల్లకీలు మోసీమోసీ ఆంధ్రోళ్ల మోచేతుల నీళ్లు తాగడానికి అలవాటుపడి వాళ్లే నయమని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యే కావడానికి బాబు పక్కన చేరుతావా?
మహాకూటమి పేరుతో కొత్త పొత్తులు ఎలా ఉన్నాయని హరీష్ రావు ప్రశ్నించారు. అక్రమ పొత్తులు అన్నారు. టీజేఎస్ అధినేత కోదండరాం కూడా వాళ్ల పంచన చేరారన్నారు. తెలుగుదేశం పార్టీని ద్రోహులు పార్టీగా ప్రకటించిన కోదండరాం ఇఫ్పుడు అదే చంద్రబాబు పక్కన చేరారని, తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకు వారి పక్కన చేరుతారా అని నిలదీశారు.