ఇవాంక పర్యటన, మెట్రో రైలు: సూపర్ హీరో, ఆయనొక్కడే అయి...
హైదరాబాద్: ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సు తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కెటి రామారావు ప్రతిష్టను పెంచింది. దాంతో పాటు హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవం కూడా కెటిఆర్ ఇమేజ్ను పెంచింంది.
Recommended Video
కెటిఆర్ ఈ రెండు కార్యక్రమాల విజయం ద్వారా సూపర్ హీరోగా నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను మినహాయిస్తే ప్రజాప్రతినిధి హోదాలో జిఈఎెస్కు హాజరైంది కెటిఆర్ ఒక్కరే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఎల్సిలు ఎవరినీ సదస్సుకు ఆహ్వానించలేదు.
పారిశ్రామికవేత్తల హోదాలోనే వారు...
మధు యాష్కీ వంటి ఒకరిద్దరు మాజీలు హాజరయ్యారు. వారు పారిశ్రామికవేత్తల హోదాలోనే సదస్సుకు వచ్చారు. చాలా ఉత్సాహంగా కెటిఆర్ సదస్సులో పాల్గొన్నారు. అనుమానాలను నివృత్తి చేయడంలో, పారిశ్రామికవేత్తలను కలిసే విషయంలో చూపిన చొరవ వంటివల్ల కెటిఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సమన్వయకర్తగా కెటిఆర్
సదస్సులో ప్రధాన భాగమైన తొలి చర్చాగోష్టికి కెటిఆర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. శ్వేతసౌధం సలహాదారు ఇవాంక ట్రంప్తో పాటు ఐసిఐసిఐ ఎండి చందాకొచ్చర్ , బ్రిటన్ మాజీ ప్రధాని టోనిబ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్ పాల్గొన్న కార్యక్రమానికి సమన్వయకర్తగా అద్భుతంగా వ్యవహరించారనే ప్రశంలను అందుకున్నారు.
కెటిఆర్ అదనపు అర్హత
రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా సందర్భోచితంగా జోక్యం చేసుకుంటూ తెలంగాణ ప్రాధాన్యాన్ని, ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకుని రావడంలో కెటిఆర్ విజయం సాధించారు.
కెటిఆర్ నెల రోజుల కసరత్తు
జిఈఎస్పై కెటిఆర్ నెల రోజుల పాటు కసరత్తు చేశారు. తొలి చర్చాగోష్టిలో ఇవాంక ట్రంప్నకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఆయన వ్యవహరించారు. తెలంగాణ కొత్త రాష్టమ్రని, 40నెలల పసిబిడ్డ అని ఆయన పదే పదే గుర్తు చేస్తూ వచ్చారు, అయినా ప్రపంచం గుర్తించే ఎన్నో అద్భుతాలను ఇప్పటికే సృష్టించామని కెటిఆర్ చెప్పారు.
ఇవాంక ట్రంప్ నోట టీ హబ్
టి హబ్ ప్రత్యేకతను ఇవాంక సైతం తన ప్రారంభోపన్యాసంలో ప్రస్తావించారు. తద్వారా ఐటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం వేసిన ప్రత్యేక ముద్రను ఆమె అందరూ గుర్తించాలని చెప్పినట్లయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టీ హబ్కు శ్రీకారం చుట్టారు.
మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా..
మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా కెటిఆర్ ప్రధాని నరేంద్రమోదీ దృష్టిని ఆకర్షించారు. ప్రధాని కొద్ది సేపు ఎదురుచూసి కెటిఆర్ ఎక్కడ అంటూ పిలిపించుకుని పక్కనే కూర్చోబెట్టుకున్నారు.
మహిళలకు వీ హబ్
మహిళా పారిశ్రామిక వేత్తల కోసం భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే మూడు నిర్ణయాలను కెటిఆర్ ప్రకటించారు. వీ హబ్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ హబ్ అని ఆయన చెప్పారు. మహిళా పారిశ్రామివేత్తలకు 15 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసే వస్తువుల విషయంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఉంటుందని కూడా చెప్పారు. అలాగే ప్రభుత్వం కొనుగోళ్లిలో నాలుగో వంతు మహిళా పారిశ్రామిక వేత్తల నుండి కొంటామని చెప్పారు.