సిరిసిల్లలో పేదల కోసం 'అన్నపూర్ణ', రోడ్డు పక్కన రూ.5 భోజనం చేసిన కేటీఆర్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు శుక్రవారం అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని ప్రారంభించారు. హరేకృష్ణ మూవ్మెంట్ వారి సహకారంతో దీనిని ప్రారంభించారు. పేదలకు రూ.5కే భోజనం అందించే పథకం అన్నపూర్ణ.
అన్నపూర్ణతో 540 మందికి భోజనం
కేటీఆర్ ఈ రోజు సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తయిన పనులను ప్రారంభించారు. ఇక్కడ అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.5 కే ఈ భోజనం అందిస్తారు. ఈ కేంద్రం ద్వారా రోజుకు 540 మంది భోజనం లభిస్తుంది.
కేటీఆర్ సంతోషం
ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ... రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్నపూర్ణ భోజన కేంద్రం ప్రారంభించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఇక్కడ అన్నార్తులకు అయిదు రూపాయలకే రుచికరమైన భోజనం లభిస్తుందని చెప్పారు.
రుచికరమైన భోజనం
రూ.5 భోజనం 'అన్నపూర్ణ' పథకాన్ని ప్రారంభించిన అనంతరం కేటీఆర్ అక్కడే భోజనం చేశారు. స్థానికులతో మాట్లాడుతూ అధికారులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ... ఇక్కడ రూ.5కే అన్నార్తులకు రుచికరమైన భోజనం దొరుగుతుందని చెప్పారు. మరోవైపు, రాజన్న సిరిసిల్లలోని నెహ్రూ నగర్లో వైకుంఠ ధామం, ఇందిరా పార్క్, ఏకలవ్య కమ్యూనిటీ హాల్, శాంతినగర్ ఓపెన్ జిమ్ను ప్రారంభించారు.