2030నాటికి మెగా సిటీ: కామినేని జంక్షన్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్: 2030నాటికి హైదరాబాద్ మహా నగరం మెగా సిటీగా అవతరిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు వ్యాఖ్యానించారు. ఇప్పటికే హైదరాబాద్ భారతదేశంలో ఐదో స్థానంలో ఉందని, త్వరలో మూడో స్థానానికి చేరుకుంటుందని అన్నారు.
ఎల్బీనగర్ కామినేని కూడలి వద్ద 945 మీటర్ల పొడవు, 12మీటర్ల వెడల్పుతో రూ.49కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి మహేందర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యతో కలిసి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నగరంలో ఎన్ని వంతెనలు నిర్మిస్తున్నా ట్రాఫిక్ సమస్య ఇంకా పెరుగుతూనే ఉందని, ప్రజా రవాణా వ్యవస్థ బాగుపడితేనే ఈ సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. ప్రస్తుతం ఎల్బీనగర్ చౌరస్తాలో రెండు అండర్ పాస్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, ఇప్పటికే చింతల్కుంట అండర్పాస్ నిర్మాణం ప్రారంభమైందని చెప్పారు.
MA&UD Minister @KTRTRS inaugurated the flyover at Kamineni Hospital junction in LB Nagar today. Transport Minister Mahender Reddy, MLAs R.Krishnaiah, Teegala Krishna Reddy, MLC Karne Prabhakar, Mayor @bonthurammohan, @CommissionrGHMC Janardhan Reddy participated in the program. pic.twitter.com/sSwlmkVE1n
— Min IT, Telangana (@MinIT_Telangana) August 10, 2018
రూ.1,500కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా రూ.450 కోట్లతో ఎల్బీనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు.
కామినేని ఎడమవైపు ఫ్లైఓవర్ ప్రారంభం కాగా, కుడివైపు ఫ్లైఓవర్ వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.