జూలై చివరి నాటికి మెట్రో ఫేజ్ 2, మెట్రో ఛార్జీలు ఎక్కువ అనడం సరికాదు: కేటీఆర్
Recommended Video
హైదరాబాద్: అమీర్ పేట - ఎల్బీ నగర్ మార్గంలో మెట్రో ట్రయల్ రన్ను బుధవారం నిర్వహించారు. ట్రయల్ రన్ను మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పరిశీలించారు. వారు అమీర్ పేట నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. మెట్రో ఫేజ్ 2 త్వరలో అందుబాటులోకి రానుంది.
ఈ సందర్భంగా అమీర్ పేట - ఎల్బీ నగర్ మార్గంలో మెట్రో ట్రయల్ రన్ పరిశీలించామని మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. నగరంలో ట్రాఫిక్ వల్ల జనం ఇబ్బంది పడుతున్నారన్నారు. మెట్రో వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరుతాయన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. మెట్రో స్టేషన్లలో పనులు, సౌకర్యాలను పరిశీలించామని చెప్పారు. ప్రజా రవాణాను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. నాగోల్ నుంచి మియాపూర్ వరకు 80వేల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు.
ఇతర రాష్ట్రాల్లో కంటే మన మెట్రోలోనే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో మెట్రో నిర్మాణం జరుగుతోందన్నారు. మెట్రో కారిడార్లో 42 ప్రదేశాల్లో మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాట్లు జరిగాయన్నారు.
ఎంజీబీఎస్, నాంపల్లి రైల్వే స్టేషన్ను మెట్రోకు అనుసంధానం చేస్తున్నామన్నారు. మెట్రో ప్రారంభమైన 7 నెలలు అవుతున్నా ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. మెట్రో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయనడం సరికాదన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు మెట్రోను వేగవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. తొలి దశ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందన్నారు. జులై చివరి నాటికి మెట్రో రెండో దశ పూర్తవుతుందన్నారు.
నగరంలో మెట్రోను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతామని, 500ల ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయబోతున్నామన్నారు. మియాపూర్ స్టేషన్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ మెట్రోకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందన్నారు.