మంత్రుల అధికారాల్లో కేటీఆర్ జోక్యం..! అసంతృప్తిలో పలువురు మంత్రులు..!!
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంలో కల్వకుంట్ల తారకరామారావు ప్రమేయం రోజురోజుకూ పెరిగిపోతుందనే చర్చ జరుగుతోంది. పదవులు నిర్వహిస్తున్న మంత్రలు నామమాత్రంగానే వ్యవహరిస్తున్నారు తప్ప అదికారాలను పూర్తి స్థాయిలో వినియోగించడం లేదని, అందుకు ముఖ్యమంత్రి కుంటుంబం నుంచి సానుకూల వాతావరణం ఉండడంలేదనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్రెడ్డి కూడా తండ్రి అదికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలపై ఆదిపత్యం చేసినట్టుగానే ప్రస్తుతం తెలంగాణ కూడా జరుగుతోందని మంత్రి వర్గంలో చర్చ జరుగుతోంది.
క్యాబినెట్ లో కేటీఆర్ జోక్యం..! అన్నీ తానై వ్యవహరిస్తున్న వైనం..!!
ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్రెడ్డి తన రాజకీయ కార్యకలాపాలను విస్తరించుకున్నారు. ఏకైక తనయుడు.. పైగా భావి రాజకీయవారసుడు.. వైయస్ కూడా కొడుకు ముచ్చట కాదనలేకపోయారు. ఓ వైపు.. జనాలకు సంక్షేమ పథకాలు. తనను నమ్మినవాళ్లకు మేళ్లు చేయటంలో వైఎస్ చాలా గుట్టుగా పావులు కదిపారు. జలయజ్ఞం, పథకాలతో తాను, తనవారు, ప్రజలు మూడు వర్గాలు సజావుగా నడిపించటంలో సఫలమయ్యాడు. దాని ఫలితమే.. 2009లో సునాయాసంగా గెలవగలిగాడు. అదే సమయంలో వారసుడిని బడా వ్యాపారవేత్తగా, భూస్వామిగా మార్చటంలో బాగానే విజయం సాధించారు.
ఆనాడు జగన్.. నేడు కేటీఆర్..! వ్యక్తులు వేరైనా దారులు ఒకటే అంటున్న మంత్రులు..!!
ఇప్పుడు అదే బాటలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తనయుడు కల్వకుంట్ల రామారావు కూడా వ్యవహరిస్తున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. తొలిసారి చంద్రశేఖర్ రావు సీఎం అయ్యాక.. కొద్దికాలం మౌనంగా ఉన్నా ఆ తర్వాతి కాలంలో కేబినెట్లో మంత్రుల బాధ్యతలు కూడా తానే తీసుకునేంతగా అధికారాన్ని తన చేతుల్లో కేంద్రీకృతం చేసుకోగలిగారు. నాటి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తాను కేవలం రబ్బరు స్టాంపు మాత్రమేనంటూ పలుమార్లు ఆవేదన వెలిబుచ్చారు.
రెండోసారి అదికారంలోకి వచ్చాక పెరిగిపోయిన కేటీఆర్ ప్రమేయం..! ఆశ్యర్యపోతున్న అదికారులు..!!
మంత్రులు ఈటల, తలసాని, పద్మారావు వంటి సీనియర్లు కూడా మంత్రిగా నామమాత్రపు అధికారాలకే పరిమితమయ్యారు. 2018లో ముందస్తు గెలుపుతో కేటీఆర్ పార్టీ పగ్గాలు చేతబట్టేంత స్థాయికి చేరారు. ఎలాగూ ఐదేళ్లు అధికారంలో ఉంటారు కాబట్టే అన్నీ తానై, కేటీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ స్థాయిలో గాకపోయినా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం పూర్తిగా తన ఆదేశాలకు బద్దులై ఉండాలనేంతగా ఆదిపత్యం చెలాయిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
అన్నీ కేటీఆర్ కనుసన్నల్లోనే..! సంయమనం పాటిస్తున్న మినిష్టర్స్..!!
కాంట్రాక్టులు, అనుమతులు, కంపెనీలు.. తెలంగాణలో ఏవి పురుడు పొసుకున్నా పూర్తిగా కేటీఆర్ కనుసన్నల్లోనే జరగాలనేంతగా కల్వకుంట్ల తారక రామారావు మారారంటూ గులాబీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన రాబోయే రోజుల్లో కేటీఆర్ ఆధిపత్యం ప్రదర్శిస్తారనే అంశం పై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే దీన్ని గులాబీ నేతలు ఎంత వరకు భరిస్తారనేది మాత్రం వారి సహనంపై ఆధార పడి ఉందనేది వాస్తవం.