బాబు కాళ్ల వద్దకు, అమరావతికి దాసోహం చేస్తామా?: కాంగ్రెస్పై కేటీఆర్ నిప్పులు
మహబూబ్నగర్: కాంగ్రెస్ పార్టీతోపాటో తెలంగాణ జనసమితి అధినేత కోదండరాంపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సాగు, తాగు నీటి కోసం చేపడుతున్న ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చనిపోయిన వారి పేర్లతో కూడా ఫిర్యాదులు చేయిస్తున్నారని విమర్శించారు.
ముష్టి మూడు సీట్ల కోసం కోదండరాం
ముష్టి మూడు సీట్లకోసం కోదండరాం కాంగ్రెస్ పార్టీ ముందు మొకరిల్లుతున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ జిల్లా ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ... పాలమూరు పచ్చబడుతుంటే.. కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. తెలంగాణ రాకముందు పాలమూరు ఏవిధంగా ఉండేది... ఇప్పుడు ఎట్లుందో ఆలోచించాలని కోరారు. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దూకిందని పేర్కొన్నారు.
అసహనంతో కాంగ్రెస్..
కొత్తగా ఏర్పడిన బంగారు తెలంగాణకు బాటలు వేయాలంటే పునాది గట్టిగా ఉండాలని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఎన్నో కేసులు వేసిందని తెలిపారు. పెద్ద నాయకులు వెనక ఉండి... చిన్న నాయకులతో కేసులు వేయించారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమురును ఎండబెట్టిన నాయకులు.. ఇపుడు అభివృద్ధి అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇంటింటికి త్రాగునీరు... ప్రతి ఎకరాకు సాగు నీరు అన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ తపిస్తుంటే... కాంగ్రెస్ నాయకులు అసహనంతో ఉన్నారని విమర్శించారు.
డైపర్లు కూడా మారుస్తామంటారు..
కర్ణాటక.. తమిళనాడు రాష్ట్రాల్లో సమస్య ఏదైనా వస్తే... అన్ని పార్టీలు ఏకమై పోరాడుతాయి.. కానీ ఇక్కడ మాత్రం ప్రతిపక్ష పార్టీలు కేసులు వేస్తాయని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ గుంపులు గుంపులుగా జత కడుతున్నాయని ఆరోపించాయి. ఉద్యమం సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి ఎక్కడున్నారు.. కిరణ్ కుమార్ రెడ్డి చంకలో చేరి దొంగ సంతకాలు చేసిన ఘనులని ఆరోపించారు.వాళ్ళ వాగ్దానాల చిట్టా చూస్తే.. ఆశ్చర్యమేస్తోందని తెలిపారు. పెళ్ళి కానీ వారికి పెళ్లి సంబంధాలు తెస్తామనీ.. వారి పిల్లలకు డైపర్లు కూడా మారుస్తామని చెప్తారేమో అని ఎద్దేవా చేశారు. అది మహాకూటమి కాదు.. పాలమూరుకు ద్రోహ కూటమి అని విమర్శించారు కేటీఆర్.
బాబు కాళ్లు, అమరావతికి దాసోహం చేస్తామా?
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్నే మరోసారి ముఖ్యమంత్రిని చేయాలన్నారు. నాగర్కర్నూల్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డిని మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. నాగం జనార్ధన్ రెడ్డికి ఓటేస్తే ఆగమేనని అన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పొరపాటున ఆ కూటమి గెలిస్తే.. చంద్రబాబు కాళ్ల వద్ద, అమరావతికి దాసోహం కావాల్సి వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.