గడ్డం పెంచితే గబ్బర్ సింగ్లు కాలేరు, సన్నాసులనలేదనే వారి బాధ: ఏకేసిన కేటీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలపై మంత్రి కేటీ రామారావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలు తిరస్కరించినా కాంగ్రెస్ నేతలకు బుద్ధి రావడంలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో మంత్రి సమక్షంలో మాచారం కాంగ్రెస్ ఎంపీపీ ఎల్. నర్సింగరావు,తదితరులు టీఆర్ఎస్లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్.
కేసీఆర్.. సన్నాసులు, దద్దమ్మలనలేదనే వారి బాధ
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభలో కేసీఆర్ కాంగ్రెస్ నేతలను సన్నాసులు, దద్దమ్మలని తిట్టకపోవడంతో తెగ బాధపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందని.. చివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరణించిన చోటకూడా టీఆర్ఎస్ గెలిచిందని కేటీఆర్ గుర్తుచేశారు.
గడ్డం పెంచినంత మాత్రాన గబ్బర్ సింగ్ కాలేరు
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా కాంగ్రెస్ ఓటమి పాలైనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి గడ్డం పెంచుకున్నంత మాత్రాన గబ్బర్ సింగ్ కాలేడని, ఓట్లు పడలేవని మంత్రి కేటీఆర్ ఎద్దేవా ఎద్దేవా చేశారు.
వార్డుల్లో కాంగ్రెస్ను గెలుపించలేని రాహుల్.. తెలంగాణలోనా?
రాహుల్ సొంత నియోజకవర్గం అమెథీలోని మన్సిపల్ వార్డుల్లో కాంగ్రెస్ను గెలిపించుకోలేకపోయారని.. తెలంగాణలో ఎలా గెలిపిస్తాడని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల కుటుంబాలు రాజకీయాల్లో ఉండొచ్చు.. కానీ కేసీఆర్ కుటుంబం రాజకీయాల్లో ఉంటే తప్పేంటి? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ సంక్షేమ పథకాలే మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటలు బద్దలు కొట్టి 100 సీట్లు గెలుస్తామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
50రోజుల్లో 100 బహిరంగ సభలు
ఇది ఇలా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల్లో 100 బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి హరీశ్రావు తెలిపారు. సెప్టెంబర్ 7న హుస్నాబాద్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎం బహిరంగ సభకు ‘ప్రజల ఆశీర్వాద సభ'గా నామకరణం చేసినట్లు తెలిపారు. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు, సభా స్థలాన్ని మంత్రలు ఈటెల రాజేందర్, హరీశ్రావు, ఎంపీ వినోద్కుమార్, ఎమ్మెల్యే సతీష్కుమార్ పరిశీలించారు. నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా సభలు నిర్వహించనున్నట్లు హరీశ్రావు చెప్పారు.