'మా గోస చూడయ్యా': కేటీఆర్ చేయి పట్టుకుని మరీ లాక్కెళ్లింది
హైదరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని నాలాలు, చెరువులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తడంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హుస్సేన్ నగర్ సహా నగరంలోని చెరువులన్నీ నిండుకుండల్లా ఉన్నాయి.
మంత్రి కేటీఆర్ సమీక్ష
దీంతో ప్రభుత్వం అభ్యర్ధన మేరకు రంగంలోకి దిగిన ఆర్మీ ఆల్వాల్ ప్రాంతంలో వరదనీటిలో చిక్కుకున్న వారిని పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉంటే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్, అధికారులతో కలిసి శుక్రవారం నగరంలో విస్తృతంగా పర్యటించారు.
స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్
హుస్సేన్సాగర్ వద్ద వరద నీటిని మంత్రి కేటీఆర్ సమీక్షించారు. అక్కడి నుంచి అల్వాల్ వెళ్లిన మంత్రి స్థానికుల సమస్యలు అడిగి తెలుసు కున్నారు. అల్వాల్లోని వెన్నెలగడ్డ చెరువు వద్దకు వెళ్లిన కేటీఆర్ దగ్గరకు ఒక వృద్ధురాలు వచ్చి తన గోడు వెళ్లబోసుకుంది. 'మా గోస చూడయ్యా' అంటూ మంత్రి కేటీఆర్ చెయ్యిపట్టుకునిమరీ తన ఇంటికి తీసుకెళ్లింది. వరద ఉధృతికి తన ఇల్లు నీటిలి మునిగిపోయిందని సాయం చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్ని కోరింది. దీంతో వృద్ధురాలికి అవసరమైన సహాయసహకారాలు అందించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు.
ఫొటోలు తీసేందుకు ఉత్సాహం
రోజంతా పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు బాధితుల కోసం చేపడుతోన్న చర్యలను పర్యవేక్షించారు. కొన్ని ప్రాంతాల్లో యువకులు మంత్రి కేటీఆర్ను ఫొటోలు తీసేందుకు ఉత్సాహం చూపారు. అల్వాల్, మోత్కుంట, కొత్త చెరువులు, నాలాలను మంత్రి పరిశీలించారు. అనంతరం జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్లో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ హైదరాబాద్ నగరంలో పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని సూచించారు.
పుకార్లు, దుష్ప్రచారాలు నమ్మవద్దు
ప్రజలు ఎలాంటి పుకార్లు, దుష్ప్రచారాలు నమ్మవద్దని ఆయన కోరారు. అవసరమైతే ఆర్మీ రంగంలోకి దించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. నగరంలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోందని అన్నారు.
ప్రభుత్వం సిద్ధంగా ఉంది
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. హుస్సేన్సాగర్ లోతట్టు ప్రాంతాల వాసులను అప్రమత్తం చేశామని, ముంపునకు గురైన భండారీ లేఅవుట్, ఇతర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. నాలాలు తొలగించే క్రమంలో ప్రజలు, మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అధికారులతో మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.