దివిటిపల్లిలో ఐటీ పార్కుకు కేటీఆర్ శంకుస్థాపన, 15వేల ఉద్యోగాలు: బోటులో షికారు
Recommended Video
మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం దివిటిపల్లిలో ఐటీ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ రోజు పాలమూరు జిల్లా చరిత్రలో లిఖించదగ్గ రోజు అని చెప్పారు.
ఐటీ పార్కుతో 15వేల ఉద్యోగాలు
పాలమూరులో ఐటీ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ పార్కులో దాదాపు 100 పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుందన్నారు. ఐటీ టవర్ నిర్మాణానికి 50 కోట్ల రూపాయాలు మంజూరు చేసి 9 నెలల్లోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఐటీ పార్క్ ఏర్పాటు ద్వారా 15 వేల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
సస్యశ్యామలం చేస్తున్నాం..
సీఎం కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లా రుణం తీర్చుకుంటున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో అత్యధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు అని అన్నారు. పాలమూరు జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నామని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను నింపుతున్నామని చెప్పారు.
పాలమూరుకు సంపూర్ణ న్యాయం
యువతకు విద్యాఉపాధి అవకాశాలు కల్పించేలా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎలా సాధించుకున్నామో.. అదే విధంగా పాలమూరు జిల్లాకు సంపూర్ణమైన న్యాయం సిద్ధించే వరకు కృషి చేస్తామన్నారు.
పెద్ద చెరువు మినీ ట్యాంక్బండ్..
గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. పాలమూరు జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువును అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే చెరువులో కంపచెట్లు మొలిచేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెరువులను అభివృద్ధి చేస్తున్నామని, పెద్ద చెరువును మినీట్యాంక్బండ్గా తయారు చేస్తున్నామని చెప్పారు. హుస్సేన్సాగర్ వద్ద ఉన్న నెక్లెస్ రోడ్ మాదిరి.. పెద్ద చెరువు వద్ద నిర్మించేందుకు రూ. 24 కోట్లు మంజూరు చేసి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ చెప్పారు. జడ్చర్ల - మహబూబ్నగర్ మెయిన్రోడ్డు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.