'కేటీఆర్ ఏమీ చిన్నపిల్లాడు కాదు.. చిరుతపులి లాంటోడు'
హైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ను చిరుతపులితో పోల్చారు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 'కేటీఆర్ ఏమీ చిన్నపిల్లాడు కాదు.. చిరుతపులి లాంటోడు' అని ఆయన అభివర్ణించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పంజా విసిరితే కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగిందని అన్నారు.
మానవ వనరుల అభివృద్ధి కోసం కేటీఆర్ నిరంతరం పని చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం మానసిక శాస్త్రం చదివిన వ్యక్తి కేటీఆర్ అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పైనా, నేతలపైన ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కాంగ్రెస్ నేతలు మానుకోవాలని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు.
ప్రజల సంక్షేమం, కోటి ఎకరాలకు నీళ్లివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. తాము అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మీరు గాంధీ భవన్లో కవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అవినీతి రాజ్యానికి చక్రవర్తిలా వ్యవహరించిందని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
హజ్ యాత్రికుల కోటా పెంచాలంటూ సుష్మా స్వరాజ్కు కేసీఆర్ లేఖ
తెలంగాణ నుంచి ప్రతి ఏడాది వేలాదిగా ముస్లింలు పవిత్ర మక్కా నగరంకు హజ్ యాత్రకు వెళ్తోన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోటా పెంచాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఆయన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్కు లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్రంలో 44.74 లక్షల మంది ముస్లింలు ఉన్నారని, హజ్ యాత్రకు వెళ్లేందుకు 17 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకుంటే కేవలం 2532 మందికి మాత్రమే కోటా కేటాయిస్తున్నారని తెలిపారు. దీంతో మిగతా వారు చాలా మంది అసంతృప్తికి గురవుతున్నారని వివరించారు. రాష్ట్రం నుంచి కనీసం 4500 మందిని హజ్కు వెళ్లడానికి అవకాశం కల్పించాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.