రంగంలోకి కెటిఆర్, తెరాస ఎమ్మెల్యే విచారం:తెలంగాణ యువతపై ఘంటా
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట అటవీ అధికారిపై దాడి చేసిన ఘటన విషయంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రంగంలోకి దిగారు. ఇరు వర్గాల మధ్య ఆయన రాజీ కుదిర్చారు. దాడి ఘటన పైన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విచారం వ్యక్తం చేశారు.
మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట అటవీ అధికారిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర జూనియర్ అటవీ అధికారుల సంఘం శనివారం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే బాలరాజు సమక్షంలో అతని అనుచరులు అటవీ రేంజ్ అధికారి రామేశ్వర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
సోమవారం నాటికి ఎమ్మెల్యే, అతని అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యోగులంతా సామూహిక సెలవులో వెళ్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంత్రి కెటి రామారావు జోక్యం చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే బాలరాజు దాడి పైన విచారం వ్యక్తం చేశారు.
మరోసారి ఇలాంటివి జరగనీయబోవన్నారు. కేటీఆర్, టిజివోల సంఘం ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ల సమక్షంలో బాలరాజుకు అటవీ అధికారుల మధ్య రాజీ కుదిరింది. ఈ విషయాన్ని శ్రీనివాస్ గౌడ్.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో సమస్య తీవ్రం గాకుండా పరిష్కరించాలని కేటీఆర్కు సూచించారు.
కేటీఆర్ ఆదివారం తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బాలరాజు, అటవీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాడికి గురైన అధికారి రామేశ్వర్ రెడ్డితో బాలరాజు చేతులు కలిపారు. అధికారులంటే తమకు గౌరవం ఉందని, సంఘటన ఉద్దేశపూర్వకంగా జరగలేదని ఆయన విచారం వ్యక్తంచేశారు.
అవసరమైతే తప్ప: టిఎస్పిఎస్సీ చైర్మన్ ఘంటా
చరిత్ర అంటే గతంలోకి వెళ్లడమని, దానిని తెలుసుకోకుంటే భవిష్యత్తును నిర్మించుకోవడం సాధ్యం కాదని, ఇన్నాళ్లు మన చరిత్ర ఏంటో తెలియకుండానే పెరిగామని, ఇకనైనా జ్ఞాపకాల దొంతరలు కదిలించి చరిత్ర మూలాలు తెలుసుకోవాలని టిఎస్పిఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు.
సిద్దిపేటలో ఆదివారం జరిగిన మంజీర రచయితల సంఘం 29వ వార్షికోత్సవానికి హాజరైన చక్రపాణి మాట్లాడారు. తెలంగాణలోని యువత, అవసరం వస్తే తప్ప చరిత్ర తెలుసుకోవడానికి ఉత్సుకత ప్రదర్శించలేదన్నారు.
టిఎస్పిఎస్సీ నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో గట్క, నాగలి, తరి, ఖుష్కి వంటి ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానం రాయలేక పోయారని, దీన్ని బట్టి మన గురించి మనకు ఎంతగా తెలుసో అర్థమౌతోదన్నారు. యువత, విద్యార్థుల్లో తెలంగాణ చరిత్ర గురించి తెలుసుకోవాలన్న అనురక్తి పెంచేందుకే గ్రూప్స్లో చరిత్రకు సంబంధించిన అంశాలను పెట్టామన్నారు.