ఒక్కసారి ఆలోచించండి! కలల లోకంలో విహరింప చేస్తలేం: కెటిఆర్
హైదరాబాద్: టిఆర్ఎస్ ఎన్నో అభివృద్ధి పనులు అంటూ కలల లోకంలో విహరింప చేస్తోందని అనుకోవద్దని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఉక్కు మనిషి అని, ఆయన అనుకున్నవి చేస్తారని మంత్రి కెటిఆర్ మంగళవారం అన్నారు. ఆయన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్లో మాట్లాడారు.
14 ఏళ్ల కిందట తెలంగాణ వస్తుందని కెసిఆర్ అంటే అందరూ నవ్వారని, అలాంటి అసాధ్యాన్ని కెసిఆర్ సుసాధ్యం చేశారన్నారు. అలాగే తెలంగాణ అభివృద్ధి విషయంలోను చేసి చూపిస్తామన్నారు. హైదరాబాద్ చుట్టూ 11 స్కేవేలు నిర్మిస్తామన్నారు.
హైదరాబాదులో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. కలల లోకంలో విహరింప చేస్తున్నారని కొందరు అనుకోవచ్చునని, కానీ కెసిఆర్ మహా సంకల్పం ఉన్న నాయకుడు అన్నారు. ఆయన చెప్పినవి అన్నీ చేసి చూపిస్తున్నారన్నారు.
హైదరాబాద్ ప్రజలు ఇప్పటి వరకు కాంగ్రెస్, బిజెపి, టిడిపి, మజ్లిస్ పార్టీలకు అవకాశమిచ్చారని, ఇప్పుడు మాకు అవకాశమిస్తే మేం ఏం చేస్తామో చూడాలన్నారు. ఇప్పటికే పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పారు. తెరాసకు ఒక్కసారి అవకాశమిస్తే... 50 ఏళ్లలో ఏం చేశారో, ఇప్పుడు మేం ఏం చేస్తామో చూస్తారన్నారు.
తెలంగాణ వచ్చాక, తెరాస అధికారంలోకి వస్తే.. హైదరాబాదులోని మిగతా వారిని బెదిరిస్తారని, వారిని బతకనివ్వరని, వారి ఆస్తులు లాక్కుంటారని తమ పైన విష ప్రచారం చేశారన్నారు. తమ పాలనలో ఎక్కడైనా ప్రాంతీయ వివక్ష కనిపించిందా అని ప్రశ్నించారు. అందరూ ఒకసారి ఆలోచించాలన్నారు.
జైలు హైదరాబాద్ మధ్య ఉండాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. మంచి ప్రణాళిక ఉంటే పాతబస్తీని అభివృద్ధి చేయవచ్చన్నారు. పాతబస్తీని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఉపాధి కల్పన, నిరుద్యోగ యువతకు భరోసా ఇస్తున్నామన్నారు. ఓల్ట్ సిటీ ట్రాఫిక్ మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నామన్నారు.
ప్రజల జీవన పరిమాణాలు మెరుగుపడాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. విభజనతోనే ఆంధ్రాలో అభివృద్ధి జరుగుతోందన్నారు. త్వరలో హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు పూర్తవుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక.. గూగుల్, అమెజాన్ తదితర సంస్థలు వచ్చాయన్నారు.
వందల ఎకరాల ప్రభుత్వ స్థలాలు నగరంలో ఉన్నాయని చెప్పారు. పెద్దపెద్ద సంస్థలు అన్నీ హైదరాబాదులో క్యాంపస్లు ఏర్పాటు చేశాయన్నారు. ఏ నగరంలోను ఐటీ రంగంలో రిజర్వేషన్లు సాధ్యం కాదని చెప్పారు. ప్రయివేటు రంగంలో స్కిల్డ్ పీపుల్స్ను మాత్రమే తీసుకుంటారని చెప్పారు.
టీహబ్ వినూత్న ఆలోచనలకు వేదిక అని చెప్పారు. ఐటీ రంగంలో సంకుచితత్వం వ్యవహరించవద్దన్నారు. వంద కంపెనీల్లో పది కంపెనీలు క్లిక్ అయినా చాలా ఉద్యోగాలు వస్తాయన్నారు. సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. టాస్క్ పేరుతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఉద్యోగ స్వీకర్తలు కాకుండా సృష్టికర్తలు కావాలన్నారు. మేం 150 స్థానాల్లో పోటీ చేస్తామని, 100 స్థానాలు గెలుస్తామన్నారు.