‘గవర్నర్ను టార్గెట్ చేస్తే ఛైర్మన్కు గాయం’: దాడి చేసిన వారి సభ్యత్వం రద్దు?
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల తొలిరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరుపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని స్కాంగ్రెస్ పార్టీగా అభివర్ణిస్తూ.. ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.
ఇంకెన్నాళ్లీ గూండాగిరీ, చర్యలు తప్పవు: కోమటిరెడ్డికి తలసాని హెచ్చరిక, 24గంటల పర్యవేక్షణ
మట్టికరవక తప్పదు
‘స్కాంగ్రెస్ పార్టీకి చర్చించేందుకు సబ్జెట్కు లేదు. కనీసం హుందాగా అసమ్మతి తెలిపే నైతిక అధికారం కూడా లేదు. స్కాంగ్రెస్ విఫల ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు చూసి, విసిగిపోయి, ఆ పార్టీని చెత్తకుప్పలో విసిరేశారు. ఆ పార్టీ ఎంత రౌడీయిజానికి దిగినా.. మట్టికరువక తప్పదు' అంటూ కేటీఆర్ ఘాటుగా ట్వీట్ చేశారు.
హెడ్ సెట్ విసిరికొట్టిన కోమటిరెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో సోమవారం తీవ్ర ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో విపక్ష కాంగ్రెస్ సభ్యుల్లో కొందరు దురుసుగా ప్రవర్తించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన హెడ్సెట్ను విసిరికొట్టడంతో.. మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి స్వల్ప గాయమైంది.
గవర్నర్ టార్గెట్ కానీ..
శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్పై కాంగ్రెస్ సభ్యులు దాడి చేయడం దారుణమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ముందు జాగ్రత్త వల్లే గవర్నర్కు పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. గవర్నర్ లక్ష్యంగా కాంగ్రెస్ సభ్యులు దాడి చేస్తే.. ఛైర్మన్కు గాయమైందని ఆయన చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు. కాంగ్రెస్ సభ్యులది హేయమైన చర్య అని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వం సీరియస్
కోమటిరెడ్డి హెడ్సెట్ విసిరేసిన దృశ్యాలు అసెంబ్లీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అసెంబ్లీలో తాజా పరిణామాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని, కాంగ్రెస్ సభ్యులపై సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి దాడికి పాల్పడిన వీడియోను కూడా అసెంబ్లీ సిబ్బంది విడుదల చేశారు.
వారి సభ్యత్వం రద్దు చేసే అవకాశం
ఛైర్మన్పై దాడికి పాల్పడిన వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అంతేగాక, ఆందోళనలో పాల్గొన్న మరో ముగ్గురు సభ్యులపై స్పీకర్ వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నేటి సాయంత్రం లేదా రేపు స్పీకర్ దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఏపీ శాసనమండలి సమావేశాలు జరిగిన భవనాన్ని స్వాధీనం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం అక్కడే రేపట్నుంచి మండలి సమావేశాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.