ఎవరూ మర్చిపోరు, చిరంజీవి, జగన్లకు ఇక్కడే చుక్కలు చూపించారు!: కేటీఆర్
Recommended Video
వరంగల్: తెలంగాణ ఉద్యమం సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైయస్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవిలకు చుక్కలు చూపిన గడ్డ మానుకోట అని మంత్రి కేటీ రామారావు అన్నారు. ఆయన గురువారం వరంగల్, మానుకోట జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే.
మానుకోటలో ఆయన మాట్లాడారు. జగన్, చిరంజీవిలకు చుక్కలు చూపిన గడ్డ మానుకోట అని, ఇక్కడి ప్రజల ఉద్యమ స్ఫూర్తిని ఎప్పటికీ మరువలేమన్నారు. మహబూబాబాద్ పట్టణాభివృద్ధికి ఇప్పటికే రూ.15 కోట్లు మంజూరు చేశామని, ఇంకా మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు.
ఆ విషయాన్ని ఎవరూ మరిచిపోరు
గిరిజన జిల్లా అయిన మహబూబాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేస్తామని కేటీఆర్ తెలిపారు. ఇది మామూలు గడ్డ కాదని చెప్పారు. జగన్, చిరంజీవిలకే చుక్కలు చూపించిన విషయాన్ని ఎవరూ మరిచిపోరన్నారు. మానుకోట వేదికగా సమైక్యవాదులను తరిమికొట్టిన ఘనత ఇక్కడి గిరిజన బిడ్డలకు దక్కుతుందన్నారు. ఎన్నో నమ్మకాలు, అపనమ్మకాలు, హేళనల మధ్య తెలంగాణ ప్రజల అందరి ఆశీర్వాదంతో కేసీఆర్ తెలంగాణను సాధించారన్నారు.
పగటి వేషగాళ్ల వలె తిరుగుతున్నారు
సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో జోడెద్దుల స్వారీ చేస్తూ తెలంగాణ కొత్త చరిత్ర సృష్టిస్తోందని కేటీఆర్ అన్నారు. డెబ్బై ఏళ్లలో ఏ ప్రధానీ, ఏ ముఖ్యమంత్రీ సాధించని అభివృద్ధిని కేసీఆర్ నాలుగేళ్లలో సాధించారన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్సుయాత్రలపేరుతో పగటి వేషగాళ్లలా తిరుగుతున్నారన్నారు.
గంగిరెద్దుల వాళ్లు ఇప్పుడెందుకు
ఖమ్మం జిల్లా పాలేరులో పంటనష్టం జరిగిందా అని కాంగ్రెస్ నాయకులు వెళ్లి రైతులను అనేక ప్రశ్నలు అడిగితే సంక్రాంతి మొన్ననే పోయిందని, గంగిరెద్దోళ్లు ఇప్పుడెందుకు వస్తున్నారని రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్వారు వేషాలు వేసి, మారువేషాలు వేసి, బహురూప వేషాలు వేసి రైతులను ఏమార్చే ప్రయత్నం చేస్తే నమ్మే స్థితిలో తెలంగాణ రైతులు లేరన్నారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఆగదు
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి తీరుతుందని కేటీఆర్ తెలిపారు. పది నుంచి 15వేల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. కేంద్రం సహకరించకపోయినా సింగరేణి, టీఎస్ ఎండీసీ ఆధ్వర్యంలో మనమే నిర్మించుకుందామని సీఎం మాటగా చెప్తున్నానని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో రైతులకు చేయని విధంగా రూ.17వేలకోట్ల రుణమాఫీ చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు.