జైట్లీకి కౌంటర్: 'ఆకస్మికంగా రాలేదు' 'వాస్తవాలు తెలుసుకోవాలి'
హైదరాబాద్: దేశంలో అవసరానికి మించి నగదు చలామణిలో ఉందని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి జైట్లీ ప్రకటనపై తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు మంత్రులు స్పందించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. కేంద్రమంత్రి జైట్లీ అభిప్రాయంతో వీరిద్దరూ కూడ విభేదించారు.
దేశంలో నగదు సమస్యపై సమీక్ష నిర్వహించిన జైట్లీ ఆ సమస్యలపై మూడు రోజుల్లోనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకొంటామని మంగళవారం నాడు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. ముఖ్యంగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో తీవ్రంగా నెలకొన్న కరెన్సీ కష్టాలపై జైట్లీ వివరణకు ఆయన కౌంటర్ ఇచ్చారు. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత ఆకస్మికంగానో లేదా తాత్కాలికంగానో రాలేదంటూ ట్వీట్ చేశారు. గత మూడు నెలలుగా హైదరాబాద్లో పదే పదే ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని ట్వీట్ చేశారు. అంతేకాదు బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని క్రమంగా వమ్ము చేస్తున్న సమస్యపై ఆర్బీఐ, ఆర్థికమంత్రిత్వ శాఖ లోతుగా పరిశీలించాలని కోరారు.
లోకేష్ ఏమన్నాడంటే
వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వాస్తవ విరుద్దంగా మాట్లాడుతున్నారని ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు జైట్లీ ట్వీట్కు ఆయన కౌంటరిచ్చారు. వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా అంతా బాగుందని అంటున్నారని, అరుణ్ జైట్లీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం బాధాకరమని అన్నారు.
ఏపీలో నగదు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాగే పింఛన్లు, ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లోకేశ్ ప్రస్తావించారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఇప్పటికే సీఎం చంద్రబాబు లేఖ రాసినప్పటికీ ఫలితం లేకుండాపోయిందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరచి నగదు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.