అద్భుతం: సెవెన్ టూంబ్స్ను సందర్శించిన కేటీఆర్(పిక్చర్స్)
షేక్పేటలోని సెవెన్ టూంబ్స్ హైదరాబాద్ చరిత్రను, కీర్తి ప్రతిష్ఠలను చాటి చెబుతున్నాయని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు.
హైదరాబాద్: షేక్పేటలోని సెవెన్ టూంబ్స్ హైదరాబాద్ చరిత్రను, కీర్తి ప్రతిష్ఠలను చాటి చెబుతున్నాయని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇప్పటివరకు ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలను చూడలేకపోయానని అన్నారు. వందల ఏళ్ల చరిత్రకు చిహ్నంగా నిలిచిన హైదరాబాద్లోని వారసత్వ కట్టడాలకు యునెస్కో గుర్తింపు లభించేలా ప్రయత్నించాలని ఆదేశించారు.
మన చరిత్ర ఔన్నత్యం
చారిత్రక వారసత్వ కట్టడాల పరిరక్షణ జరుపాలని, మన చరిత్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పాల మంత్రి అన్నారు. ప్రపంచ దేశాల నుంచి టూరిస్టులను ఆకర్షించేలా మన కార్యాచరణ ఉండాలని ఆయన పేర్కొన్నారు. మంగళవారం కుతుబ్షాహి టూంబ్స్లో రాష్ట్ర పురావస్తు శాఖ, ఆగాఖాన్ ఫౌండేషన్ల సంయుక్తాధ్వర్యంలో పునరుద్ధరించిన బడీబౌలిని ఆయన సందర్శకుల కోసం ప్రారంభించారు.
పర్యవేక్షణ
108ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సెవెన్ టూంబ్స్, అలంకరణ, అద్భుతంగా తీర్చిదిద్దిన కట్టడాలు సందర్శకులకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పంచి పెడుతున్నాయన్నారు. అదేవిధంగా టూంబ్స్ సమీపంలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన డక్కన్ పార్క్ను, పార్క్ పురోగతిని ఆయన పర్యవేక్షించారు. త్వరలో ఈ పార్క్ను ప్రారంభిస్తామని చెప్పారు.
ప్రశంసనీయం
సెవెన్ టూంబ్స్లో పర్యాటకులకు సకల సదుపాయాలను కల్పించాలని, టూరిస్టులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు ఉండాలని మంత్రి పేర్కొన్నారు. పురావస్తుశాఖ, ఆగాఖాన్ ఫౌండేషన్లు రెండేళ్ల పాటు కృషి చేసి బడీబౌలిని పునరుద్ధరించడం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. పునరుద్ధరణ తర్వాత బడీబౌలి చాలా సుందరంగా ఉన్నదన్నారు.
సందర్శకులను పెంచాలి
హైదరాబాద్లోని కుతుబ్షాహి టూంబ్స్తోపాటు చారిత్రక వారసత్వ ప్రదేశాలకు సందర్శకుల సంఖ్య పెరిగేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. మంత్రి వెంట రాష్ట్ర పురావస్తు శాఖ డైరక్టర్ విశాలాక్షి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి, పురావస్తుశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములునాయక్ తదితరులు ఉన్నారు.