జగన్ లండన్ వెళ్తూ కేటీఆర్ చేతికి బాధ్యతలు, కేసీఆర్! విశాఖకు రా!: కేటీఆర్పై ఏపీ మంత్రులు
అమరావతి/హైదరాబాద్: ఏపీలో టీడీపీ చిత్తుగా ఓడిపోతుందని, వైసీపీ విజయం సాధిస్తుందని, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం నిప్పులు చెరిగారు.
సర్వే: కాబోయే సీఎం జగన్, పవన్ కళ్యాణ్కు అందనంత ఎత్తులో, ఎవరికి ఎంతమంది ఓటేశారంటే?
జగన్ లండన్ వెళ్తూ కేటీఆర్కు బాధ్యతలు
జగన్ లండన్ పర్యటనకు వెళ్తూ పార్టీ ఇంచార్జి బాధ్యతలను కేటీఆర్కు అప్పగించారని దేవినేని ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాలకు తాను రాజుగా ఉంటూ జగన్ను ఏపీకి సామంత రాజుగా నియమించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. వైసీపీ, తెరాస జోడీకి ఏపీ ప్రజలు కంబైన్డ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారన్నారు. వైసీపీకి అద్దె మైకులా బీజేపీ నేత జీవీఎల్ నర్సింహా రావు మాట్లాడుతున్నారన్నారు. తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, మీ పెత్తనాలు, కుటుంబ పాలన కోసం రాష్ట్రాన్ని విడదీశారన్నారు. ఇప్పుడు ఏపీపై పెత్తనం చెలాయించాలని బయలుదేరితే సహించేది లేదని చెప్పారు.
హైదరాబాద్ ఆస్తులపై బెదిరింపులు
హైదరాబాద్లో వ్యాపారాలు చేసే వారిపై దాడులు చేస్తున్నారనీ, నోటీసులు ఇచ్చి ఆస్తులు ఆక్రమించుకుంటామని బెదిరిస్తున్నారని దేవినేని ఆరోపించారు. పోలవరాన్ని సందర్శిస్తే అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి ఎక్కడ వాస్తవాలు చెప్పాల్సి వస్తుందోనని జగన్ భయపడుతున్నారన్నారు. ఢిల్లీని తలపించేలా అమరావతి రాజధానిని నిర్మిస్తామని చెప్పిన మోడీ రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చి ఏపీని ఎగతాళి చేశారన్నారు. మోడీ తెలుగు జాతిపై ఎందుకు కక్ష కట్టారో చెప్పాలన్నారు. ఏపీ బిర్యానీ పేడ అని, ఏపీ బ్రాహ్మణులకు మంత్రాలు రావని అవమానించిన కేసీఆర్తో జగన్ కలవడం విడ్డూరమన్నారు.
ఓ వైపు ఏపీపై కుట్ర, మరోవైపు జగన్ గెలవాలని
పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తన కుమార్తె కవితతో సుప్రీం కోర్టులో కేసులు వేయిస్తున్న కేసీఆర్ ఏపీలో జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని దేవినేని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే వీరిమధ్య ఎంతటి పవిత్రబంధం ఉందో అర్థమవుతోందన్నారు. ఓ వైపు పోలవరంపై కుట్రలు చేస్తూ, మరోవైపు ఏపీలో జగన్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం కేసు వేస్తే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ కావాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. పోలవరం పూర్తికాకుండా ప్రతీనెల అడ్డంపడుతున్న టీఆర్ఎస్ నేతలు నీతులు చెప్పడం మానుకోవాలన్నారు.
కేసీఆర్! విశాఖపట్నం రా.. వచ్చి చెప్పు
కేసీఆర్! ఏపీకి వస్తానని చెప్పావుగా, రా... విశాఖపట్నం వచ్చి చెప్పు అని దేవినేని సవాల్ విసిరారు. లేదంటే ఒకటో తేదీన ముగ్గురూ కలిసి విశాఖపట్నం వచ్చి బహిరంగ సభలో మీ రాజకీయాలు బయటపెట్టండని చెప్పారు. మీ అవినీతి రంకులన్నీ బయటపడాలన్నారు. కేసీఆర్, జగన్, మోడీ కలిసి జగన్నాటకం ఆడుతున్నారన్నారు. ఏపీకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మీ చుట్టూ 29సార్లు తిప్పించుకుని ఈ రోజు అవినీతిపరుడు జగన్తో చేతులు కలుపుతారా అని బీజేపీపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై కవిత ఎందుకు కేసులు వేశారో కేసీఆర్, కేటీఆర్ చెప్పాలన్నారు. చంద్రబాబు 26 పార్టీలను ఏకతాటిపైకి తెస్తే తమ దేశభక్తిని శంకిస్తారా అని నిలదీశారు. అధికారం ఉందనే మిడిసిపాటు తగదన్నారు. కేసీఆర్ మాట్లాడే ప్రతి మాటా తమ ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉందని, అయిదు కోట్ల మంది ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జూన్లో చంద్రబాబు సూచించే వ్యక్తే ప్రధాని అవుతారన్నారు.
కేటీఆర్ పైన లోకేష్
మంత్రి నారా లోకేష్ కూడా కేటీఆర్ పైన నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీ, వైసీపీ అధినేత వైయస్ జగన్తో కేసీఆర్ కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. ఢిల్లీ మోడీ, తెలంగాణ మోడీ, ఏపీ మోడీ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత వైయస్ జగన్పై నిప్పులు చెరిగారు. 420తో చేతులు కలిపారన్నారు.
చంద్రబాబును దులిపేసిన కేటీఆర్
కాగా, శనివారం కేటీఆర్ పిచ్చాపాటిగా మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు వందశాతం ఓడిపోతారని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కూటమిపై చర్చించేందుకు ఇప్పటికే జగన్ను కలిశామని, కేసీఆర్ కూడా కలవాల్సిన సమయంలో కలుస్తారని, తెలంగాణలో తెరాస, ఏపీలో వైసీపీ ఎక్కువ స్థానాలు సాధిస్తే రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఇరు పార్టీలు కలిసి ఢిల్లీలో కృషి చేయవచ్చునని చెప్పారు. ఏపీలో జరిగే ఎన్నికల్లో చంద్రబాబు వందశాతం ఓడిపోతారని, ఢిల్లీలో కాదు కదా కనీసం విజయవాడలో కూడా ఆయన చక్రం తిప్పలేరని, ఏపీలో పారిశ్రామికవేత్తలైన ఎంపీల మీద ఏటీ దాడులు జరిగితే బాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. ఆయనకు బినామీలు ఉన్నారా, అన్ని రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయని, తమ పార్టీకి చెందిన ఎంపీ మీద దాడి జరిగాయని, తాము మాట్లాడలేదని చెప్పారు. చంద్రబాబు మాత్రం కేబినెట్లోనూ దాడులపై మాట్లాడారని గుర్తు చేశారు. హైదరాబాద్లో ఆస్తులున్న ఏపీ టీడీపీ నేతలను బెదిరించి వైసీపీలో చేర్పిస్తున్నట్లు కొత్త పాట మొదలుపెట్టారని, హైదరాబాద్లో చంద్రబాబుకు కూడా ఆస్తులు ఉన్నాయనే విషయాన్ని ఆయన మరిచిపోయారన్నారు. గత అయిదేళ్లలో ఏపీలో ఆయన చేసిందేమీ లేదన్నారు. ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు పలికామని చెప్పారు. కేసీఆర్ విషయంలో చంద్రబాబు ఎన్ని భావోద్వేగాలను రెచ్చగొట్టినా ఏపీ ప్రజలు పట్టించుకోరని, ఇక్కడ శాసనసభ ఎన్నికల్లో అదే జరిగిందన్నారు.