కొంత ఇబ్బంది వాస్తవమే: కెటిఆర్, మ్యాథ్స్ను చూసి భయపడ్డ మంత్రి!
హైదరాబాద్: ఉద్యోగులకు హెల్త్ కార్డుల విషయంలో కార్పోరేట్ ఆసుపత్రులు కొంత ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమేనని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం అన్నారు. ఉద్యోగులతో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడారు.
హెల్త్ కార్డుల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి ఉద్యోగులంతా కష్టపడాలన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, ప్రభుత్వం పైన విశ్వాసం ఉంచాలన్నారు. పదవులు ఎప్పుడూ శాశ్వతం కాదని చెప్పారు. బంగారు తెలంగాణ కోసం అందరం కలిసికట్టుగా పని చేయాలన్నారు.
తెలంగాణ సర్కార్ ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పారు. తెలంగాణలో సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి అయినా ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను రప్పిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు.
పదో తరగతిలో మ్యాథ్స్ అంటే భయపడిన కెటిఆర్
పదో తరగతి సమయంలో తాను మ్యాథ్స్ అంటే చాలా భయపడేవాడినని కెటిఆర్ చెప్పారట. పదో తరగతిలో ఉండగా గణితంలో సాధారణ ఫార్ములాలను కూడా అర్థం చేసుకోలేకపోయేవాడినని, టెస్ట్ పేపర్స్ చూసినా ఫలితం ఉండకపోయేదన్నారు.
ఆ సమయంలో తాను.. భవిష్యత్తులో గణితం నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించేవాడినన్నారు. తన తల్లిదండ్రులకు.. తనకు సైన్స్ అంటే ఇష్టం లేదని చెప్పేందుకు ప్రయత్నించానని, అప్పుడు తన తండ్రి (కెసిఆర్) మినహాయింపు సిద్ధాంతం సరికాదని సూచించారన్నారు.
ముఖ్యమంత్రి పాలన మరిచిపోయారు: కాంగ్రెస్
ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి నిధులు తేవడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మంగళవారం నాడు మండిపడ్డారు. తాము రాజకీయం చేయడం లేదని, రైతుల కోసం పోరాడుతున్నామని చెప్పారు.
ప్రాజెక్టుల విషయంలో కెసిఆర్ ఫ్రభుత్వం ఒంటెత్తు పోకడలకు పోతోందని మల్లుభట్టి విక్రమార్క మండిపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబానికి ఉపయోగపడేలా ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులో మార్పులు అంగీకరించమని చెప్పారు.
ముఖ్యమంత్రి పాలనను మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసలు సచివాలయానికే రావడం లేదన్నారు. కెసిఆర్ తీసుకునే నిర్ణయాలు తెలంగాణ కోసం కాకుండా కుటుంబ సభ్యుల కోసం అన్నట్లుగా ఉందన్నారు. తన కుటుంబానికి ఉపయోగపడే నిర్ణయాలనే ముఖ్యమంత్రి తీసుకుంటున్నారన్నారు.