చెన్నై వరదలు.. హైదరాబాద్ అంతే, గబ్బు పట్టించారు: సీమాంధ్ర పాలకులపై కెటిఆర్
హైదరాబాద్: ఇటీవల చెన్నైలో వరదలు వస్తే అతలాకుతలం అయిందని, ఇప్పుడు హైదరాబాదు కూడా అలాగే ఉందని తెలంగాణ మంత్రి కెటి రామారావు సోమవారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సభలో ఆయన మాట్లాడారు.
హైదరాబాదు ఇప్పుడు చెన్నైకి ఏం భిన్నంగా లేదన్నారు. సమైక్య పాలనలో హైదరాబాదును గాలికొదిలేశారన్నారు. ఒకప్పుడు హుస్సేన్ సాగర్ వద్ద ముక్కుమూసుకోకుండా ఉండలేకపోయేవాళ్లమని, ఇప్పుడు దానిని తమ ప్రభుత్వం పరిశుభ్రం చేసిందన్నారు.
19 నెలల్లో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. నిజాం కాలం నాటి ఉస్మాన్ సాగర్ వంటి వాటిని తప్ప సీమాంధ్ర పాలకులు ఒక్క జలాశయాన్ని అయినా కట్టారా అని ప్రశ్నించారు. దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందన్నారు. గూగుల్, అమేజాన్ వంటి పెద్ద సంస్థలు హైదరాబాదుకు వరుస కడుతున్నాయన్నారు.
తెలంగాణ వస్తే దాడులు జరుగుతాయని, కరెంట్ ఉండదని విష ప్రచారం చేశారన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ వెలిగిపోతుంటే నాడు కరెంట్ ఉండదని చెప్పిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కనిపించకుండా పోయారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమన్నారు.
ఎండకాలంలోను కోతలు లేని విద్యుత్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్దే అన్నారు. 60 ఏళ్ల సమైక్య పాలనలో మంచినీళ్ల కోసం ప్రజలకు ఒక్క జలాశయాన్ని సీమాంధ్ర పాలకులు నిర్మించలేదన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు క్రమంగా నెరవేర్చుకుంటామన్నారు.
హైదరాబాద్కు మానవ, ఆర్థిక వనరులు అన్నీ ఉన్నాయని, ఆరు నెలల్లో విద్యుత్ సరఫరా సమస్యను ఎలా పరిష్కరించారని అందరూ అడుగుతున్నారని చెప్పారు. తెలంగాణలో బ్రహ్మాండంగా 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.
విద్యుత్ సరఫరా విషయంలో విజయం సాధించామని, నీటి సరఫరా విషయంలో ముందడుగు వేస్తున్నామని, నగరంలో రద్దీకి అనుగుణంగా రహదారుల నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. గతంలో హైదరాబాద్ మురికివాడల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు.
నగర పారిశుద్ధ్యానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రజల భాగస్వామ్యంతో హైదరాబాద్ అభివృద్ధికి కెసిఆర్ పని చేస్తున్నారన్నారు. హైదరాబాద్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.
హుస్సేన్ సాగర్ ఒకప్పుడు మంచినీటి సరస్సుగా ఉండేదని 60 ఏళ్ల సమైక్య పాలనలో గబ్బు పట్టించారని మండిపడ్డారు. సమైక్య పాలకులు నిజాం నవాబులు నిర్మించిన సరస్సుల ద్వారానే మంచినీటి సరఫరా చేశారుగానీ భవిష్యత్ హైదరాబాద్ అవసరాల గురించి ఆలోచించలేదన్నారు.
ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు. ప్రజలు, ఉద్యోగులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ వస్తే సీమాంధ్రులపై, పారిశ్రామికవేత్తలపై దాడులు జరుగుతాయని విష ప్రచారం చేశారని మండిపడ్డారు. కానీ ఇవాళ ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు.