రూ. 45వేలు డెబిట్ కార్డు ద్వారా చెల్లించి పట్టుచీరల కొనుగోలు
రూ. 45వేలు డెబిట్ కార్డు ద్వారా చెల్లించి పట్టుచీరల కొనుగోలు
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్దేశానికి మరింత ప్రచారం కలిగించేలా మంత్రి కేటీఆర్.. తన డెబిట్ కార్డును ఉపయోగించి పట్టు చీరలు కొనుగోలు చేశారు.
వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని దండుమల్కాపురంలోని అపెరల్ టెక్స్ టైల్స్ పార్కును సందర్శించారు మంత్రి కేటీఆర్. అక్కడి చీరలను చూసిన ఆయన.. ఎంతో బాగున్నాయంటూ అబ్బురపడ్డారు.
అక్కడ తయారైన పట్టు చీరలను చూసి ముగ్ధుడైన కేటీఆర్.. తన తల్లి, చెల్లెలు, సతీమణి కోసం మూడు పట్టు చీరలు కొన్నారు. చెల్న దేశాయ్ రూపొందించిన ఈ పట్టు చీరలతో పాటు రెండు పట్టు పావడాలను రూ. 45 వేలు పెట్టి కొనుగోలు చేశారు కేటీఆర్. కాగా ఆ మొత్తాన్ని తన డెబిట్ కార్డును స్వైప్ చేయడం ద్వారా చెల్లించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేతన్నల కోసం కొత్త పాలసీని తేనున్నామని, అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులను పెంచనున్నామని స్పష్టం చేశారు. వస్త్రాలను నేరుగా కొనుగోలు చేస్తామని, ఆపై మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు.